హైదరాబాద్ లో తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. ప్రపంచ నలుమూలల నుంచి వచ్చిన తెలుగువారితో, సాహితీ ప్రముఖులతో, అవధానులతో ఈ వేడుకలు కన్నులపండుగగా జరుగుతున్నాయి.ఎల్బీ స్టేడియంలో ఈ సాయంత్రం 6 గంటలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో సినీ సంగీత విభావరి జరగనుంది. ఈ కార్యక్రమానికి పలువురు టాలీవుడ్ ప్రముఖులు హాజరవుతున్నారు.
ఈ కార్యక్రమాన్ని తెలుగు సినిమా సంగీత దర్శకుల సంఘం సహకారంతో ఏర్పాటు చేశారు. సంగీత దర్శకులు వందేమాతరం శ్రీనివాస్, ఆర్పీ పట్నాయక్, శ్రీలేఖ, కల్యాణీమాలిక్, సాయికార్తీక్, రాధాకృష్ణన్ కార్యక్రమానికి నేతృత్వం వహిస్తారు. గబ్బర్సింగ్ దర్శకుడు హరీశ్శంకర్, బృందావనం దర్శకుడు వంశీ పైడిపల్లి, మాటల రచయితలు పరుచూరి బ్రదర్స్, నిర్మాత దిల్రాజు, సినీనటులు అక్కినేని నాగార్జున, పోసాని కృష్ణమురళి, మా అధ్యక్షుడు శివాజీరాజా, జయసుధ తదితర సినీ ప్రముఖులు పాల్గొంటారు. గతకొన్ని రోజులుగా ఈ విభావరి కోసం ప్రత్యేకంగా సాధన చేశారు.