తాడేపల్లిగూడెంకు చిరంజీవి..

612
chiru
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి ఈ నెల 6న తాడెపల్లి గూడెంకు రానున్నారు. నట చక్రవర్తి ఎస్వీ రంగారావు విగ్రహవిష్కరణ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఇప్పటికే పలుమార్లు ఈ కార్యక్రమం అనివార్య కారణాల వల్ల వాయిదా పడగా తాజాగా ఈ నెల 6న చిరంజీవి….ఎస్వీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని ఎస్‌వీఆర్‌ సేవాసంఘం అధ్యక్షుడు భోగిరెడ్డి రాము తెలిపారు.

రాజకీయాలకు అతీతంగా ఎస్వీ రంగారావు కాంస్య విగ్రహ ఆవిష్కరణకు చిరంజీవి అభిమానులు పెద్దఎత్తున తరలిరావాలని కోరారు. మౌలిక వసతులు, ట్రాఫిక్‌ సమస్యలు లేకుండా చిరంజీవి అభిమానులు సహకారం అందించాలన్నారు. హైదారాబాద్‌ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారని, అక్కడి నుంచి తాడేపల్లిగూడెం వస్తారన్నారు.

ఎస్వీఆర్ పూర్తి పేరు సామర్ల వెంకట రంగారావు. 3 జూలై 1918 లో జ‌న్మించారు. 18 జూలై 1974లో ప‌ర‌మ‌ప‌దించారు. కృష్ణా జిల్లా, నూజివీడులో జన్మించిన రంగారావు కొద్ది రోజులు మద్రాసు, ఏలూరు, విశాఖపట్నంలో చదువుకున్నారు. చదువుకునే రోజుల నుంచీ నాటకాల్లో న‌టించారు. షేక్ స్పియ‌ర్ డ్రామాల్లో న‌టించిన అనుభ‌వంతోనే సినీన‌టుడు అయ్యారు.

చదువు పూర్తయిన తర్వాత ఫైర్ ఆఫీసరుగా కొద్ది రోజులు ఉద్యోగం చేసిన ఆయ‌న‌ నటనపై పూర్తి స్థాయిలో దృష్టి సారించడం కోసం ఉద్యోగానికి రాజీనామా చేశారు. 1946లో వచ్చిన వరూధిని అనే చిత్రం ఆయనకు నటుడిగా తొలి చిత్రం. అయితే ఈ చిత్రం ఆశించినంతగా విజయవంతం కాకపోవడంతో మళ్ళీ సినిమా అవకాశాలు రాలేదు. కొద్ది రోజులు జంషెడ్పూర్ లోని టాటా సంస్థలో ఉద్యోగం చేశారు. మళ్ళీ సినిమా అవకాశాలు రావడంతో అక్కడి నుంచి వచ్చేసి దాదాపు మూడు దశాబ్దాలపాటు తెలుగు- తమిళ- కన్నడ, మలయాళ-హిందీ భాషల్లో 300 పైగా చిత్రాల్లో నటించారు.

రావణుడు, హిరణ్య కశిపుడు, ఘటోత్కచుడు, కంసుడు, కీచకుడు, నరకాసురుడు- మాంత్రికుడు లాంటి ప్రతినాయక పాత్రలతో గొప్ప న‌టుడిగా పేరు తెచ్చుకున్నారు. సాంఘీకంలోనూ అనేక సహాయ పాత్రలలో తనదైన ముద్ర వేశాడు. పాతాళ భైరవి, మాయాబజార్, నర్తనశాల ఆయన ప్రముఖ పాత్రలు పోషించిన కొన్ని సినిమాలు. నర్తనశాలలో ఆయన నటనకు గాను భారత రాష్ట్రపతి పురస్కారమే కాక ఇండోనేషియా ఫిల్మ్ ఫెస్టివల్ పురస్కారం కూడా అందుకున్నారు. విశ్వనట చక్రవర్తి, నట సార్వభౌమ, నటసింహ బిరుదులు అందుకున్నారు.

- Advertisement -