ఈరోజు ‘మా’ ఎన్నికల కోసం హైదరాబాద్ జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో ఆదివారం ఉదయం 8 గంటల నుంచి ఓటింగ్ ప్రారంభమైంది. ఈ పోలింగ్ మధ్యాహ్నాం 2గం.లకు పూర్తి కానుంది. ఈ రోజు ఉదయాన్నే మంచు విష్ణు ప్యానల్ సభ్యులంతా పోలింగ్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. నరేష్, మోహన్ బాబు, మంచు విష్ణు సహా విష్ణు భార్య విరానిక కూడా అక్కడికి చేరుకొని గెలుపుపై ధీమాగా కనిపించారు. ప్రకాశ్ రాజ్ వచ్చిన సమయంలో విష్ణుని కలిసి హగ్ ఇచ్చారు.
ఇక ఓటు వేసేందుకు ఒక్కొక్కరు వస్తున్నారు. పవన్ కళ్యాణ్ ,చిరంజీవి, రామ్ చరణ్, బాలకృష్ణ, తనికెళ్ల తనికెళ్ళ భరణి, రఘుబాబు, ఆకాశ్ పూరి తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు హక్కు వినియోగించుకున్న చిరంజీవి మాట్లాడుతూ.. ఓటర్లే విజేతలు ఎవరనేది నిర్ణయిస్తారు. ప్రకాశ్ రాజ్ కి మెగా ఫ్యామిలీ మద్దతు ఉందనేది అవాస్తవం అని అన్నారు.
కాగా, తెలంగాణ కోఆపరేటివ్ సొసైటీ విశ్రాంత ఉద్యోగులతో పోలింగ్ నిర్వహిస్తున్నారు. ‘మా’లో మొత్తం 925 మంది సభ్యులు ఉండగా, వీరిలో 883 మంది సభ్యులకు ఓటు హక్కు ఉంది. 500 మందికిపైగా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది. ఓట్ల లెక్కింపులో భాగంగా తొలుత ఈసీ సభ్యుల ఫలితాలను వెల్లడిస్తారు. చివర్లో అధ్యక్షుడి ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. రాత్రి 8 గంటల తర్వాత అధ్యక్షుడి ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.