బీజేపీ కలిసి వస్తే తగిన నిర్ణయం తీసుకుంటాం

11
- Advertisement -

అభ్యర్థుల ఎంపికలో సామాజిక న్యాయానికి పెద్దపీట వేశామని, విద్యావంతులకు, యువతకు ప్రాధాన్యం ఇచ్చామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మహిళలకు అవకాశం కల్పించడంతో పాటు ప్రజల మధ్యే ఉండి ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కునే వారిని అభ్యర్థులుగా ప్రకటించామని వివరించారు. టీడీపీ-జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితాను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిసి శనివారం ప్రకటించారు. 94 సీట్లలో టీడీపీ అభ్యర్థులను తొలి జాబితాలో ప్రకటించారు. జనసేన పోటీ చేసే 24 స్థానాల్లో ఐదుగురు అభ్యర్థులను పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అభ్యర్థుల ప్రకటన అనంతరం ఇద్దరు నేతలు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ….రాష్ట్ర భవిష్యత్తు కోసం టీడీపీ-జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి. వ్యక్తులు, పార్టీ ప్రయోజన కోసం టీడీపీ-జనసేన కలవలేదు. 5 కోట్లమంది ప్రజల ప్రయోజనాల కోసం టీడీపీ-జనసేన కలిసి పనిచేయాలని నిర్ణయించాయి. నేడు రాష్ట్రానికి చారిత్రాత్మక రోజు. మంచి ప్రయత్నానికి ఇది తొలి అడుగు. విభజన వల్ల రాష్ట్రం నష్టపోయింది. నష్టపోయిన రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పెట్టడానికి ప్రయత్నించాం. రాష్ట్రం విడిపోవడం వల్ల ఏపీకి జరిగిన నష్టం కంటే జగన్ సీఎం అయ్యాక ఎక్కువ నష్టం. రాష్ట్రాన్ని అన్ని విధాలా కోలుకోలేని దెబ్బతీశారు. ఇది నాకు, పవన్ కళ్యాణ్ కు జరిగిన నష్టం కాదు..5 కోట్ల ప్రజలకు జరిగిన నష్టం. ఏపీ బ్రాండ్ ను పూర్తిగా దెబ్బతీశారు. ఒక వ్యక్తి బయటకు వచ్చి అన్యాయం జరిగిందని చెప్పుకోలేని పరిస్థితి రాష్ట్రంలో ఉంది. ప్రతి ఒక్కరినీ అవమానించారు…ఈ అవమానాలు ప్రజలు, కార్యకర్తలు, మేము కూడా భరించాం. పవన్ ఒక మంచి ఉద్దేశ్యంతో వెళ్తే… ఇప్పటం గ్రామ ఘటన నుండి విశాఖలో రోడ్ షోను కూడా అడ్డుకున్నారు.

టీడీపీ-జనసేన శ్రేణులు క్షేత్రస్థాయిలోనూ మనస్ఫూర్తిగా సహకరించుకుని ముందకు నడవాలి. అధికారంలోకి రాగానే జగన్ ప్రజావేదిక విధ్వంసం చేశారు…కనీసం శిథిలాలు కూడా తొలగించలేదు. జగన్ ప్రవర్తన ఎలా ఉండబోతోందో అదొక ఉదాహరణగా చూపించారు. రాష్ట్రాన్ని జగన్ నుండి విముక్తి చేయడానికి రాష్ట్ర భవిష్యత్తు కోసం మేం పని చేస్తాం. జనసేన నుండి మంచి అభ్యర్థులను పవన్ ప్రకటించారు..మేము కూడా సమర్థులను ప్రకటించాం. అభ్యర్థుల ఎంపికపై నా రాజకీయ జీవితంలో చేయనంత ఎక్సర్ సైజ్ చేశా. దాదాపు 1.30 కోట్ల మంది అభిప్రాయాలు తీసుకున్నాం. ప్రజలు, కార్యకర్తల నమ్మకాన్ని, అభిప్రాయాన్ని తీసుకున్నాం. అన్ని కోణాల్లో విశ్లేషించాకే అభ్యర్థులను ఎంపిక చేశాం. ప్రజల మధ్య ఉండే వారిని, ప్రజల ఆమోదం పొందేవారిని, సమర్థవంతంగా ఎన్నికలు ఎదుర్కొనే వారిని అభ్యర్థులగా ప్రకటించాం.

టీడీపీ-జనసేన ఉమ్మడి తొలి జాబితాలో 99 మంది అభ్యర్థులను ఎంపిక చేశాం. ఇందులో టీడీపీ నుండి 94 మందిని ప్రకటించాం. టీడీపీ జాబితాలో మొదటిసారి పోటీ చేసేవారికి 23 మందికి అవకాశం కల్పించాం. డాక్టర్లు, ఐఏఎస్, గ్రాడ్యుయేట్లకు అవకాశం ఇచ్చాం. కానీ వైసీపీ నేతలు ఎర్రచందనం స్మగ్లర్లు, రౌడీలు, గూండాలను అభ్యర్థులుగా పెట్టారు. ప్రజలకు జవాబుదారీ తనంగా ఉండే వారినే టీడీపీ-జనసేన అభ్యర్థులుగా ప్రకటించాం. వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది..భయం కూడా ఉంది. మీడియాపైనా దాడులు చేశారు. కానీ ప్రతిఘటించలేని స్థితిలో మీడియా ప్రతినిధులు ఉన్నారు. మనోధైర్యాన్ని కూడా మీడియా ప్రతినిధులు కోల్పోయారు. రాష్ట్రంలో కార్యనిర్వాహక, శాసన, న్యాయ, ఫోర్త్ ఎస్టేట్ ను నిర్వీర్యం చేసే విధంగా ఈ ప్రభుత్వం ప్రవర్తించింది. ఒక ఐఏఎస్ అధికారి కూడా మాట్లాడే పరిస్థితి లేదు. జీవో తెచ్చి మీడియాను నియంత్రించే ప్రయత్నం చేశారు. ప్రజాధనంతో కక్ష తీర్చుకోవడానికి న్యాయవ్యస్థను దుర్వినియోగం చేస్తున్నారు. ఒక్కో అడ్వకేట్ కు కోట్లలో ప్రజాధనం ఖర్చు చేస్తున్నారు. ఈసారి జరిగే ఎన్నికలు అత్యంత కీలకమైనవి.

రాగద్వేషాలకు అతీతంగా టీడీపీ-జనసేన శ్రేణులు పనిచేసి ప్రజల్లో బలమైన నమ్మకం కలిగించాలి. టీడీపీ-జనసేన పొత్తు ప్రకటించిన రోజే మనం గెలిచాం..ఆనాడే వైసీపీ కాడిపడేసింది. కానీ రౌడీయిజం, దొంగఓట్లు చేర్చి గెలవాలని చూస్తున్నారు. అవినీతి డబ్బులతో ఓట్లు కొనే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యం..ఒక వ్యక్తికి అధికారం శాశ్వతం కాదు. ప్రజాస్వామ్యానికి ముప్పు వచ్చింది…దాన్ని కాపాడాల్సిన బాద్యత అందరిది. మా దగ్గర డబ్బులు లేకపోవచ్చు…కానీ ప్రజాబలం ఉంది. విలువలతో కూడిన రాజకీయాలు చేశాం. ప్రజలే ముందుకు వచ్చి టీడీపీ-జనసేన అభ్యర్థులను గెలిపించుకోవాలి. 5 కోట్లమంది ప్రజలు ఒకపక్క…రౌడీయిజం, అక్రమ సొమ్ము, ధనబలం, పెత్తందారులు ఉన్న వైసీపీ మరోపక్క ఉంది. మాఘపౌర్ణమి లాంటి శుభ దినాన టీడీపీ–జనసేన అభ్యర్ధులను ప్రకటించాం. రాష్ట్రానికి మంచి జరుగుతుందని ఆశిస్తున్నాం. రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం, భావితరాల భవిష్యత్తు కోసం కలిసి వెళ్లాలని నిర్ణయించాం. ఈ సీట్ల విషయంలో చాలాసార్లు చర్చలు జరిపాం. 24 అసెంబ్లీ, 3 పార్లమెంటు సీట్లలో జనసేన పోటీ చేస్తుంది. మిగిలిన సీట్లలో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుంది. బీజేపీ కూడా కలిసి వస్తే తగిన సమయంలో తగిన నిర్ణయం తీసుకుంటాం’ అని చంద్రబాబు నాయుడు వివరించారు.

పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ…. ఎక్కువ స్థానాలు తీసుకుని ప్రయోగం చేసేకంటే తక్కువ స్థానాలు తీసుకుని రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడేలా ముందుకెళ్తున్నాం. రాష్ట్రాన్ని దారిలోపెట్టడమే లక్ష్యం. పార్టీ, వ్యక్తి ప్రయోజనాలు దాటి రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకున్నాం. 2019 నుంది మనం అరాచకపాలనలో నలుగుతున్నాం. ఇలాంటి సమయంలో బాధ్యతతో ఆలోచించాం. కొందరు 45 కావాలి..75 కావాలన్నారు…వారితో అప్పుడే చెప్పా…2019లో 10 స్థానాలన్నా గెలిచి ఉంటే నేడు ఎక్కువ స్థానాలు అడగడానికి అవకాశం ఉండేది. అందుకే తక్కువ స్థానాల్లో గట్టి పోటీ ఇవ్వాలని 24 స్థానాల్లో పోటీ చేస్తున్నాం. జనసేనకు కేటాయించిన 24 స్థానాలే కనబడుతున్నాయి…కానీ 3 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తే 21 స్థానాలు జనసేనలో భాగమవుతాయి. పార్లమెంట్ స్థానాల పరిధిని కలుపుకుంటే 40 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లే లెక్క. టీడీపీ-జనసేన పొత్తు బలంగా ఉండాలని బీజేపీని దృష్టిలో పెట్టుకున్నాం. నాయకులందరూ వ్యక్తి ప్రయోజనాలు పక్కనబెట్టి రాస్ట్ర ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లాలి. ప్రభుత్వం స్థాపించగానే త్యాగాలు చేసిన వారికి ప్రతిభను బట్టి ప్రతిఫలం భవిష్యత్తులో ఉంటుంది. జనసైనికులు, వీరమహిళలు మన ఓటు టీడీపీకి ఓటు వెళ్లడం ఎంత ముఖ్యముఖ్యమో…టీడీపీ ఓటు జనసేనకు వెళ్లడమూ అంతే ముఖ్యం. తప్పకుండా టీడీపీకి జనసేన ఓటు బదిలీ అవ్వాలి. రాష్ట్రం అద్భుతంగా ఉంటుంది. పొరపత్యాలు రాకూడదు. వైసీపీ పన్నాగాలు సృష్టిస్తే కలిసికట్టుగా ఎదుర్కొంటాం. ఆయన సిద్ధం అంటున్నాడు…మేము యుద్ధం చేస్తాం. మనం గెలుస్తున్నాం…మన ప్రభుత్వం రాబోతుంది’ అని పవన్ కళ్యాణ్ ధీమా వ్యక్తం చేశారు.

Also Read:రాత్రి పూట ఈ కూరగాయలు తింటే..!

- Advertisement -