వరంగల్ జిల్లా మామునూర్ ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతిని మంజూరీ చేసిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు మామునూర్ ఎయిర్ పోర్ట్ కు అనుమతిని మంజూరీ చేస్తూ కేంద్ర పౌరవిమానయాన మంత్రిత్వశాఖ కార్యదర్శి అమిత్ కుమార్ జా, ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఛైర్మన్ కు లేఖ ద్వారా తెలియజేసినట్లు మంత్రి తెలిపారు. మామునూర్ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసి, తిరిగి కార్యకలాపాలు ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు విమానాశ్రయ ప్రాధికార సంస్థ (Airport Authority of India) అభ్యర్థనకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది నిర్ణయం తీసుకుందని ఆయన తెలిపారు.
గత పదేండ్లుగా పెండింగ్ లో ఉన్న NOC అడ్డంకిని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి జీఎంఆర్ సంస్థ యాజమాన్యంతో సంప్రదింపులు జరిపి, బోర్డులో పెట్టి NOC ఇచ్చేలా చేశారు. దీంతో HAIL తన బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ ఏర్పాటు చేసుకొని మామునూర్ విమానాశ్రయ అభివృద్ధికి అడ్డంకిగా ఉన్న 150 కిలోమీటర్ల నిబంధనను సవరిస్తూ NOC ఇచ్చారు. ఇప్పుడు ఈ NOC ని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఆమోదించిందని మంత్రి తెలిపారు. ఈ మేరకు కేంద్ర పౌరవిమానయాన మంత్రిత్వశాఖ కార్యదర్శి అమిత్ కుమార్ జా, ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఛైర్మన్ కు లేఖ ద్వారా తెలిపినట్లు మంత్రి వివరించారు. దీంతో మామునూర్ ఎయిర్ పోర్టు నిర్మాణం మరింత వేగంగా ముందుకు సాగుతుందని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.
విమానాశ్రయ ప్రాధికార సంస్థ (AAI) UO నోట్ నెం. PLG/501/Warangal /2025/80 తేదీ 03.02.2025 ప్రకారం, తెలంగాణ ప్రభుత్వం 05.12.2024 మరియు 17.11.2024 తేదీలలో పంపిన లేఖలను ప్రస్తావిస్తూ, హైదరాబాదు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ (HIAL) మామునూర్ ఎయిర్ పోర్ట్ అభివృద్ధికి ‘నో అబ్జెక్షన్ సర్టిఫికేట్’ (NOC) జారీ చేసినట్లు లేఖలో పేర్కొందని తెలిపిన మంత్రి అందుకు సంబంధించిన లేఖను విడుదల చేశారు.
Also Read:మహా సీఎం ఫడ్నవీస్కు బెదిరింపులు
అంతేకాదు, మామునూర్ ఎయిర్ పోర్ట్ అభివృద్ధికి కావాల్సిన 253 ఎకరాల అదనపు భూమిని తెలంగాణ ప్రభుత్వం విమానాశ్రయ ప్రాధికార సంస్థ (AAI)కి అప్పగించేందుకు ఇంతకు ముందే 205 కోట్ల రూపాయలను విడుదల చేసిన విషయాన్ని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఎయిర్ పోర్టుకు కావాల్సిన అన్ని అనుమతులు రావడంపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

