తెలంగాణ జ్వర సర్వే పై కేంద్రం ప్రశంసలు..

56
- Advertisement -

కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు ముఖ్యమంత్రి కేసిఆర్ ఆలోచనతో ప్రారంభించిన జ్వర సర్వేపై కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుక్ మాండవీయ ప్రశంసించారు. తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యూహాన్ని “మంచి వ్యూహం”గా అభినందించారు. ఇదే విధానాన్ని అన్ని రాష్ట్రాల్లో అనుసరించేందుకు విధాన రూపకల్పన చేస్తామని, ఆ దిశగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. రాష్ట్రాల్లో కరోనా పరిస్థితులపై కేంద్ర వైద్యారోగ్య మంత్రి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో ఏపీ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, లక్ష ద్వీప్, అండమాన్ నికోబార్, పుదుచ్చేరి రాష్ట్రాల వైద్యారోగ్య శాఖ మంత్రులు, ఉన్నతాధికారు పాల్గొన్నారు. తెలంగాణ తరుపున వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఖమ్మం కలెక్టరేట్ నుండి పాల్గొన్నారు. రాష్ట్రంలో కరోనా పరిస్ధితులు, ప్రభుత్వం సన్నద్ధత, జ్వర సర్వే, వ్యాక్సినేషన్ తదితర అంశాలపై మంత్రి కేంద్ర మంత్రిత్వ శాఖకు వివరించారు.

రెండో వేవ్ సమయంలో కరోనా కట్టడి కోసం దేశంలోనే తొలిసారి తెలంగాణ జ్వర సర్వే మొదలు పెట్టి మంచి ఫలితాలు సాధించిందని మంత్రి హరీశ్ రావు వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో మరోసారి జ్వర సర్వే ప్రారంభించుకున్నట్లు తెలిపారు. మొత్తం 21,150 బృందాలు జ్వర సర్వేలో పాల్పంచు కుంటున్నాయని, ఆరోగ్య, పంచాయితీ లేదా మున్సిపల్ విభాగాల నుండి ఒక్కో బృందంలో ముగ్గురు ఉంటారని, వీరంతా ప్రతి ఇంటికి వెళ్ళి వారి ఆరోగ్యాన్ని పరీక్షిస్తారని తెలిపారు. లక్షణాలు ఉన్నవారికి అక్కడే హోమ్ ఐసొలేషన్ కిట్స్ ఇస్తున్నామని, తదుపరి వారం పాటు వారి ఆరోగ్య పరిస్థితిని మానిటర్ చేస్తారని తెలిపారు. అవసరం అయితే సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారనీ చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో రాష్ట్రంలో కోటి హోమ్ ఐసోలేషన్ కిట్లు, రెండు కోట్ల టెస్టింగ్ కిట్లు సమకూర్చుకున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 77,33,427 ఇండ్లల్లో జ్వర సర్వే చేయడం జరిగిందనీ, 3,45,951 కిట్లను అందించడం జరిగిందనీ వివరించారు. జ్వర సర్వే తో ప్రభుత్వం వైద్యాన్ని ఇంటి వద్దకే చేర్చిందనీ, దీని వల్ల పాజిటివిటి రేటు తగ్గి, హాస్పిటలైజేషన్ తగ్గిందని చెప్పారు. లక్షణాలు ఉన్న వారు ప్రభుత్వం ఇస్తున్న హోమ్ ఐసోలేషన్ కిట్లు వినియోగించడం వల్ల మూడు, నాలుగు రోజుల్లో కోలుకుంటున్నట్లు చెప్పారు. మరో వైపు కొవిడ్ ఓపి సేవలను సబ్ సెంటర్, పీహెచ్ సి, బస్తీ దవాఖానల నుండి జిల్లా, టీచింగ్ ఆసుపత్రుల వరకు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో వ్యాక్సినేషన్ విజయవంతంగా కొనసాగుతున్నట్లు మంత్రి వివరించారు. రాష్ట్రంలోని 27 వేలకు పైగా ఉన్న అన్ని పడకలకు ఆక్సిజన్ సౌకర్యం కల్పించినట్లు తెలిపారు.

60 ఏళ్లు దాటిన అందరికీ బూస్టర్ డోసు ఇవ్వాలి…
కోమార్బిడిటీస్ వారితోపాటు, 60 ఏళ్ల వయస్సు పై బడిన వారందరికీ బూస్టర్ డోసు ఇవ్వాలని మంత్రి హరీశ్ రావు మరోసారి విజ్ఞప్తి చేశారు. కోవిషీల్డ్ రెండు డోసుల గడువును తగ్గించాలని, అలాగే రెండో డోసు ప్రికాషనరీ డోసు మధ్య వ్యవధి 9 నెలల నుండి 6 నెలలకు తగ్గించాలని అన్నారు. 18 ఏళ్లు దాటిన ప్రతి పౌరుడికి బూస్టర్ ఇచ్చే విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలని కోరారు.

పెండింగ్ నిధులు విడుదల చేయాలి…..
ఈసిఅర్పీ-2 కింద రాష్ట్రానికి రావాల్సిన రెండో దశ పెండింగ్ నిధులు విడుదల చేయాలని కోరారు. పిడియాట్రిక్ ఐ సి యూ లకు ఎస్ ఎన్ సి యూ తరహాలో అవసరమైన మానవ వనరులను సమకూర్చాలని, కేంద్రం సరఫరా చేసిన వెంటిలేటర్స్ ని వినియోగం లోకి తెచ్చేందుకు అవసరమైన హ్యుమిడిఫయర్లను కూడా సరఫరా చేయాలని కోరారు.

- Advertisement -