కరోనా వ్యాప్తి నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పలువురు సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు ఆర్ధిక సాయం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వానికి పలువురు టాలీవుడ్ హీరోలతో పాటు, ఎమ్మెల్యేలు, ఎంపీ, ఎమ్మెల్సీలు తమ వంతు సహాయం చేస్తున్నారు. ఈరోజు కూడా పలువరు ప్రముఖులు సీఎం సహాయ నిధికి భారీ ఎత్తున విరాళాలు అందించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశాఖపట్నం జిల్లా మాదుగుల నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ తన రెండు నెలల పెన్షన్ ను ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా ప్రకటించారు.
కోహినూర్ గ్రూప్స్ ముఖ్యమంత్రి సహాయ నిధికి కోటి రూపాయల విరాళం అందించారు. దీనికి సంబంధించిన చెక్కును గ్రూప్ చైర్మన్ మహ్మద్ అహ్మద్ ఖాద్రి ప్రగతి భవన్ లో శుక్రవారం ముఖ్యమంత్రి కేసీఆర్ కు అందించారు. అనురాగ్ విద్యాసంస్థల తరపున రూ. 25లక్షలు విరాళంగా ఇచ్చారు. దీనికి సంబంధించిన చెక్కును అనురాగ్ సంస్థల చైర్మన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ కు అందించారు. అపర్ణ కన్ స్ట్రక్షన్ తరపున ఆసంస్ధ డైరెక్టర్ ఉదయ్ రెడ్డి ముఖ్యమంత్రి సహాయనిధికి రెండు కోట్ల రూపాయలు విరాళంగా అందించారు.