అధికారులతో రజత్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్…

380
cec rajath kumar
- Advertisement -

కొత్త‌గా ఓటు హ‌క్కు పొందుట‌కు 18 సంవ‌త్స‌రాలు నిండిన యువ‌త‌పై ప్ర‌త్యేక దృష్టి సారించి న‌మోదు చేయించాల‌ని చీఫ్ ఎల‌క్టోర‌ల్ ఆఫీస‌ర్ డా.ర‌జ‌త్ కుమార్ జిల్లా ఎన్నిక‌ల అధికారులుగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ క‌లెక్ట‌ర్లకు సూచించారు. ఈ నెల 25న నిర్వ‌హించే 10వ జాతీయ ఓట‌రు దినోత్స‌వం సంద‌ర్భంగా ఓట‌రు న‌మోదు, ఓట‌రు చైత‌న్యంపై వార్డు, గ్రామ‌, నియోజ‌క‌వ‌ర్గ‌, జిల్లా స్థాయిల‌లో వివిధ కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించాల‌ని తెలిపారు.

10వ జాతీయ ఓట‌రు దినోత్స‌వానికి ప‌టిష్ట‌మైన ప్ర‌జాస్వామ్యానికి ఓట‌రు చైత‌న్యం అనే ఆశ‌యాన్ని ప్రాధాన్య‌త‌గా తీసుకోవాల‌ని తెలిపారు. వ‌యోజ‌నులంద‌రికీ ఓటు హ‌క్కు క‌ల్పించాల‌ని ల‌క్ష్యాన్ని సార్థ‌కం చేయాల‌ని కోరారు. ఈ అంశంపై ర్యాలీలు, సాంస్కృతిక ప్ర‌ద‌ర్శ‌న‌లు నిర్వ‌హించాల‌ని తెలిపారు. ఓట‌రుగా న‌మోదు చేసుకున్న 18-19 సంవ‌త్స‌రాల యువ‌త‌కు జాతీయ ఓట‌రు దినోత్స‌వ వేడుక‌ల్లో ఫోటో ఓట‌రు గుర్తింపు కార్డులు పంపిణీ చేయాల‌ని తెలిపారు. ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు వార్షిక క్యాలెండ‌ర్‌ను రూపొందించి స్వీప్ కార్య‌క్ర‌మాల‌ను రెగ్యుల‌ర్‌గా నిర్వ‌హించాల‌ని సూచించారు.

పాలిగాన్‌ల‌ను బార్‌కోడ్‌లుగా ఉప‌యోగించి న‌జ‌రి న‌క్షాల‌ను రూపొందించాల‌ని సూచించారు. ఓట‌రు జాబితా ప్ర‌త్యేక స‌వ‌ర‌ణ క‌ర్యాక్ర‌మంలో భాగంగా డిసెంబ‌ర్ 16న ప‌బ్లిష్ చేసిన ముసాయిదా ఓట‌రు జాబితాపై అభ్యంత‌రాలు, క్లైమ్‌ల‌కు ఈ నెల 15వ‌ర‌కు అవ‌కాశం ఉన్న‌ట్లు తెలిపారు. ఈ నెల 27లోపు అభ్యంత‌రాలు, క్లైమ్‌ల‌ను ప‌రిష్క‌రించి ఫిబ్ర‌వ‌రి 4న అనుబంధ జాబితాల‌ను సిద్దం చేయాల‌ని తెలిపారు. ప్ర‌త్యేక స‌వ‌ర‌ణ‌, ఫైన‌ల్ ప‌బ్లికేష‌న్‌ను ఫిబ్ర‌వ‌రి 7న చేయాల‌ని స్ప‌ష్టం చేశారు. ఈ ప‌క్రియ‌ను ఎన్నిక‌ల సంఘం నిబంధ‌న‌ల మేర‌కు పూర్తిచేయాల‌ని స్ప‌ష్టం చేశారు. ఈ వీడియో కాన్ఫ్‌రెన్స్‌లో హైద‌రాబాద్ జిల్లా ఎన్నిక‌ల అధికారి మ‌రియు జిహెచ్ఎంసి క‌మిష‌న‌ర్ డి.ఎస్‌.లోకేష్ కుమార్‌, అడిష‌న‌ల్ క‌మిష‌న‌ర్ జ‌య‌రాజ్ కెన‌డి, 15 నియోజ‌క‌వ‌ర్గాల‌ ఎల‌క్టోర‌ల్‌ రిజిస్ట్రేష‌న్ అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -