మజ్లిస్‌తో పొత్తు ప్రసక్తే లేదు- మాయావతి

112
Mayawati
- Advertisement -

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటిరిగానే పోటీచేస్తామని, ఎవరితో పొత్తుపెట్టుకునే ఆలోచన లేదని బహుజన్‌ సమాజ్‌వాదీ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి ప్రకటించారు. మజ్లిస్ (ఏఐఎంఐఎం)తో పొత్తు పెట్టుకుంటున్నారన్న వార్తలను ఆమె కొట్టిపారేశారు. మజ్లిస్‌తో పొత్తు పెట్టుకుంటున్నారన్న మీడియా కథనాలపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆమె.. మజ్లిస్‌తో పొత్తు ప్రసక్తే లేదని ట్వీట్ చేశారు.

‘‘మేం అసదుద్దీన్ ఒవైసీకి చెందిన మజ్లిస్‌తో పొత్తు పెట్టుకుంటున్నామని నిన్నటి నుంచి ఓ చానెల్ వార్తను ప్రసారం చేస్తోంది. ఆ వార్తల్లో నిజం లేదు. అవన్నీ నిరాధారమైన బూటకపు వార్తలు. పంజాబ్‌లో లాగా ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోం. ఒంటరిగానే ఎన్నికల్లో పోటీ చేస్తాం’’ అని ఆమె స్పష్టం చేశారు.

తప్పుదోవ పట్టించే ఇలాంటి నిరాధారమైన వార్తలపై పోరాడేందుకు రాజ్యసభ ఎంపీ, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సతీశ్ చంద్ర మిశ్రాను పార్టీ నేషనల్ కో ఆర్డినేటర్‌గా నియమిస్తున్నట్టు ప్రకటించారు. ఇలాంటి వార్తలు రాసే ముందు ఒక్కసారి సతీశ్‌తో మీడియా మాట్లాడాలని, నిజాలను నిర్ధారించుకున్నాకే వార్తలను ప్రసారం చేయాలని ఆమె మీడియాను కోరారు.

కాగా, పంజాబ్‌లో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ శిరోమణి అకాలీదళ్‌ పొత్తు పెట్టుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. మొత్తం 117 సీట్లలో అకాలీదళ్‌ 97 స్థానాల్లో, బీఎస్పీ 20 స్థానాల్లో పోటీచేస్తున్నాయి.

- Advertisement -