బీఆర్‌ఎస్‌తోనే దేశంలో గుణాత్మక మార్పులు

29
- Advertisement -

దేశంలో గుణాత్మక మార్పుల కోసమే సీఎం కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌ పార్టీ జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశిస్తోందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో దూసుకుపోతోందని… దేశంలో కూడా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు సీఎం కేసీఆర్‌ బీఆర్‌ఎస్‌ పార్టీని ఏర్పాటు చేశారని ఆమె తెలిపారు. తెలంగాణ ప్రజల ఆశీస్సులు, ఆశీర్వాదంతో బీఆర్‌ఎస్‌ పార్టీ జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించాలని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని రాజీవ్‌ గాంధీ ఆడిటోరియంలో లబ్ధిదారులకు ఎమ్మెల్యేలు గణేష్‌ గుప్తా, జీవన్‌ రెడ్డితో కలిసి కల్యాణ లక్ష్మి, షాదిముబారక్‌ చెక్కులను అందించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ ఏ కార్యక్రమం చేపట్టినా.. పేదల ప్రజల అభ్యున్నతిని దృష్టిలో పెట్టుకుని పని చేస్తారని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. సీఎం కేసీఆరే తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని.. పేదల సంక్షేమానికి నిరంతరం సీఎం కేసీఆర్‌, తెలంగాణ ప్రభుత్వం నిర్విరామంగా కృషి చేస్తోందన్నారు ఎమ్మెల్సీ కవిత. పేదింటి ఆడబిడ్డ పెళ్లికి మేనమామ లాగా సీఎం కేసీఆర్‌ రూ.లక్షా 116 సాయం అందిస్తున్నారని, దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఇలాంటి కార్యక్రమాలు అమలవుతున్నాయా అని ఆమె ప్రశ్నించారు. గతంలో కరెంటు కోసం ఎన్నో బాధలు పడ్డామని, ఇవాళ తెలంగాణలో కరెంటు పోతే ఒక వార్త అని చెప్పారు.

నిజామాబాద్‌ పట్టణాన్ని అద్భుతనగరంగా, ఆదర్శనగరంగా తీర్చిదిద్దుతామని కవిత వెల్లడించారు. నిజామాబాద్‌ కేంద్రంలోని పాత బస్టాండ్‌ ను కూల్చివేసి, రైల్వేస్టేషన్‌ దగ్గరలో కొత్త బస్టాండ్‌ ను నిర్మాస్తామన్నారు. పాత కలెక్టరేట్‌ స్థానంలో కళాభారతి నిర్మించడంతో పాటు నిజామాబాద్‌ నగరం నలుమూలలా వెజ్‌, నాన్‌ వెజ్‌ మార్కెట్లను ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. బీజేపీ నాయకులు నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నారని, అనవసరంగా ప్రజలను రెచ్చగొడుతున్నారని.. ఇది మంచి పద్దతి కాదని.. ఇప్పటికైనా బీజేపీ నాయకులు తమ తీరు మార్చుకోవాలని ఎమ్మెల్సీ కవిత హితువు పలికారు.

- Advertisement -