KTR:బీఆర్ఎస్‌ కృషి ఫలితమే ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం

11
- Advertisement -

ఒకటి కాదు రెండు కాదు.. అధికారంలోకి వచ్చిన క్షణం నుంచి పదేళ్ల పాటు ప్రజల ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు బీఆర్ఎస్ చేసిన సుదీర్ఘ ఫోరాటం ఫలించడం సంతోషంగా ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటిఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్‌-కరీంనగర్‌ రాజీవ్ రహదారి, హైదరాబాద్-నాగపూర్ జాతీయ రహదారి రూట్లలో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి రక్షణ శాఖ భూములు ఇవ్వడానికి కేంద్రం పచ్చజెండా ఊపడంపట్ల కేటిఆర్ హర్షం వ్యక్తంచేశారు. ఇది ముమ్మాటికీ బీఆర్ఎస్ పార్టీ సాధించిన విజయమని గుర్తుచేశారు. గత ఏడాది జూలై 31న జరిగిన కేబినెట్ సమావేశంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం వీటిపై నిర్ణయం తీసుకుందని, దానికి అనుగుణంగా కేంద్రం ఆమోదం తెలపడం హర్షించదగ్గ పరిణామన్నారు. గతంలోనే రక్షణశాఖ తమ ఆధీనంలోని 33 ఎకరాలను కేటాయించిందని, ఇప్పుడు మరో 150 ఎకరాలను కూడా అప్పగించేందుకు ముందుకు రావడంతో స్కైవేల నిర్మాణానికి ఉన్న అన్ని అడ్డంకులు తొలగిపోయాయని వెల్లడించారు.

ఈ రెండు రూట్లలో రక్షణ శాఖ భూములు ఉండటం వల్ల ఇంతకాలం రోడ్ల విస్తరణ సాధ్యంకాకపోవడం, దశాబ్దాల పాటు ప్రభుత్వాలు ఫ్లేఓవర్ల నిర్మాణానికి చొరవ తీసుకోకపోవడంతో… ప్రజలు ట్రాఫిక్ సమస్యతో ఇంతకాలం ఇబ్బందులు పడ్డారని పేర్కొన్నారు. అందుకే 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన నాటినుంచి ఈ రెండు మార్గాల్లో ఎలివేటెడ్ ఫ్లైఓవర్ల నిర్మాణం కోసం అనేక కీలక ప్రణాళికలు రూపొందించామని, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు అన్ని నిరంతర సంప్రదింపులు జరిపామని తెలిపారు. ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ప్రతి సందర్భంలో అప్పటి ముఖ్యమంత్రి కేసిఆర్ తోపాటు.. తాను, ఇతర మంత్రులు, ఎంపీలు ఢిల్లీ పెద్దలను కలిసి వినతిపత్రాలు అందజేశామని, ప్రతి సందర్భంలో వారు సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఎలివేటెడ్ ఫ్లైఓవర్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన అన్ని రకాల ప్రణాళికలను కేంద్ర ప్రభుత్వానికి పంపించామని, వారు లేవనెత్తిన ప్రశ్నలకు ఎప్పటికప్పుడు సమాధానాలు అందిస్తూ ప్రక్రియను వేగవంతం చేశామని తెలిపారు.

హైదరాబాద్‌లోని రక్షణ శాఖ భూముల మీదుగా ఎలివేటెడ్‌ కారిడార్ల నిర్మాణానికి మార్గం సుగమం కావడంతో ఇక ఆయా రూట్లలో వచ్చి వెళ్లే ప్రజలకు పూర్తిగా ట్రాఫిక్ కష్టాలు పూర్తిగా తీరిపోతాయని సంతోషం వ్యక్తంచేశారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు గత బీఆర్ఎస్ పదేళ్ల పాటు చేసిన పోరాటంలో భాగస్వాములైన అధికారులకు, యంత్రాంగానికి కేటిఆర్ ధన్యవాదాలు తెలిపారు. ఏ ఒక్కరి వల్లో ఇది సాధ్యం కాలేదని, ఇది సమిష్టి విజయమని స్పష్టంచేశారు. ఎల్బీనగర్ తోపాటు.. ఇతర రూట్లలో ఇలాంటి అడ్డంకులు లేకపోవడంతో… గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో.. యుద్ధప్రాతిపదికన అనేక ఫ్లేఓవర్ల నిర్మాణాలు పూర్తిచేయగలిగామని గుర్తుచేశారు. తమ పాలనలో మెరుపు వేగంతో నిర్మించిన ఫ్లేఓవర్లు, అండర్ పాస్ ల వల్ల హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ సమస్యలు శాశ్వతంగా తీరిపోయాయని స్పష్టంచేశారు. తాజాగా, జేపీఎస్ నుంచి శామీర్ పేట, ప్యారడైజ్ నుంచి కండ్లకోయ రూట్ లలో రెండు ఫ్లై ఓవర్లకు కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించిన నేపథ్యంలో.. ఇక రాష్ట్ర ప్రభుత్వం వీటి నిర్మాణాలను అత్యధిక ప్రాధాన్యతా క్రమంలో పెట్టుకుని పనులు చేపట్టాలని కోరారు. దశాబ్దాల సమస్యకు పరిష్కారం లభించిన నేపథ్యంలో.. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఎలివేటెడ్ ఫ్లేఓవర్ల నిర్మాణాలను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలన్నారు. వీటి వల్ల హైదరాబాద్ నలుదిశలా విస్తరించడంతోపాటు.. ప్రతి రూట్లో ప్రగతిపథంలో దూసుకుపోవడానికి మార్గం సుగమమైందని వెల్లడించారు. ఇన్నాళ్లకు తమ పోరాటాన్ని గుర్తించి దిగొచ్చిన కేంద్ర ప్రభుత్వ పెద్దలకు కేటిఆర్ ఈ సందర్భంగా తెలంగాణ ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు.

Also Read:ఏపీలో బీజేపీ కాపు మంత్రం!

- Advertisement -