ఆంధ్రప్రదేశ్ లో వైసిపి భారీ మెజార్టీతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. 150అసెంబ్లీ స్ధానాలతో పాటు 22ఎంపీ స్ధానాలను కైవసం చేసుకున్నారు. ఇక అటు కేంద్రంలో కూడా బీజేపీకి భారీ మెజార్టీ వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇక బీజేపీకి ప్రాంతియ పార్టీల మద్దతు అవసరం లేదనే చెప్పుకోవాలి. వైసిపికి , బీజేపీకి మధ్య సత్సంబంధాలు ఉన్నాయన్న సంగతి తెలిసిందే.
దీంతో వైసిపికి బంపర్ ఆఫర్ ఇచ్చారట ప్రధాని మోదీ. లోక్ సభ డిప్యూటీ స్పీకర్ పదవిని వైఎస్ఆర్సీపీకి ఇస్తామని బీజేపీ ప్రతిపాదించినట్టు సమాచారం. ఈ విషయాన్ని జగన్కు తెలియజేశారని, అందుకు ఆయన కూడా సుముఖంగా ఉన్నారని తెలుస్తోంది. . ఏపీ సీఎం జగన్తో బీజేపీ ఎంపీ జీవీఎల్ భేటీ కావడం ఈ ప్రచారానికి బలం చేకూర్చుతోంది.
ప్రస్తుతం లోక్ సభలో 22 మంది ఎంపీలతో వైసీపీ.. నాలుగో పెద్ద పార్టీగా ఉంది. ఈ విషయానికి సంబంధించి సీఎం జగన్ తో జీవీఎల్ తుది చర్చలు చేస్తున్నట్లుగా సమాచారం. వైసీపీ అంగీకరిస్తే మాత్రం వంగా గీతకు లోక్సభ డిప్యూటీ స్పీకర్గా పనిచేసే అవకాశం రానుంది. బీజేపీ గత సభలో అన్నా డీఎంకేకు డిప్యూటీ స్పీకర్ అవకాశం ఇచ్చింది. ఈ సారి వైసీపీకి ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది.