ఇప్పుడు బిగ్ బాస్ షో అంటేనే సంచలనం. ఇప్పుడీ షో సౌత్ లోకి వచ్చింది. తెలుగు లో ఎన్టీఆర్ , తమిళ్ లో కమల్ హాసన ఈ షో ను హోస్ట్ చేస్తున్నారు. ఇంత వరకూ బాగానే ఉన్నా…ఈ షోలో మాత్రం ఎవరూ ఊహించని సంఘటనలు జరుగుతున్నాయి. ఏ ముహూర్తాన మొదలైందోగానీ, తమిళ బిగ్బాస్కు ఆది నుంచీ ఆటంకాలే.
ఇందులో కమల్ హాసన బిగ్ బాస్ షో చాలా వివాదాస్పదమౌతుంది. మొదటి నుంచీ ఈ షో చుట్టూ వివాదాలు ముసురుకుంటూనే వున్నాయి. దాదాపుగా ప్రతి ఎపిసోడ్ వివాదాస్పదమవుతూనే వుంది. తాజాగా ఇప్పుడు అంతకుమించి ఓ కలకలం రేగింది. తమిళ బిగ్ బాస్ హౌస్లో ఓ పార్టిసిపెంట్ ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించింది. ఈ ఘటన ఇప్పుడు అక్కడ పెను దుమారాన్నే రేపుతోంది.
తన ప్రేమను తిరస్కరంచిన తోటి కంటెస్టెంట్ ఆరవ్, దూరంగా ఉంటున్నాడన్న ఆవేదనతో కంటెస్టెంట్ ఓవియా స్విమ్మింగ్ పూల్లోకి దూకి ముక్కుమూసుకుని ఆత్మహత్యకు యత్నించింది. ఈ వ్యవహారమంతా బయటకు పొక్కడంతో బిగ్ బాస్ హౌస్కు పోలీసులు వెళ్లినట్టు తెలుస్తోంది. అసలు ఆ షోలో, హౌస్లో ఏం జరుగుతోందన్నదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారని సమాచారం.
అక్కడి ప్రేక్షకులు కూడా బిగ్ బాస్ హౌస్లో అరాచక వాతావరణం కనిపిస్తోందని విమర్శిస్తున్నారు. మరోపక్క ఇదంతా అవాస్తవమైన డ్రామాగా తేలినట్లు చెబుతున్నారు. అయితే…హౌస్ మేట్ల మధ్య పోటీ పెంచడం, టీఆర్పీ రేటింగులను మరింత ఎక్కువ పొందడం కోసం షో నిర్వాహకులు పెట్టే కొన్ని షరతులు మరీ ఇబ్బందికరంగా పరిణమించాయని చెబుతున్నారు.
షోను మరింత రక్తికట్టించేందుకు అక్కడ జరిగే డ్రామాలో మరింత మసాలాను నూరేసి చేర్చేస్తున్నారట షో నిర్వాహకులు. అంతేకాదు, ఆ షోకు హోస్ట్గా వ్యవహరిస్తున్న కమల్హాసన్పైనా ప్రేక్షకులు మండిపడుతున్నారు. కుటుంబ విలువల్నీ దిగజార్చేలా బిగ్ బాస్ షో తీరు ఉందని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా.. తమిళ బిగ్ బాస్తో పోలిస్తే తెలుగులో మాత్రం కొంత కూల్ వాతావరణమే కనిపిస్తోంది.