తమిళనాట రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. వర్గ పోరుకు చెక్ పెడుతు సీఎం పళని స్వామి,పన్నీర్ సెల్వంలు విలీన నిర్ణయం తీసుకోగానే రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. శశికళ,దినకరన్లపై వేటు వేయడాన్ని నిరసిస్తు 19 మంది ఎమ్మెల్యేలు పళనికి షాకివ్వగా తాజాగా మరో ముగ్గురు ఎమ్మెల్యేలు ఆ వర్గంలో చేరిపోయారు.
ఈ నేపథ్యంలో అప్రమత్తమైన సీఎం పళని..ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించగా 40 మంది ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. దీంతో పళని తీవ్ర చిక్కుల్లో పడ్డారు. మరోవైపు రొయపెట్టాలో జరిగే పార్టీ సర్వ సభ్య సమావేశానికి తమకు ఆహ్వానం అందలేదని.. తామంతా దినకరన్ వెంటే నడుస్తామని ఎమ్మెల్యే తంగ తమిళసెల్వన్ స్పష్టం చేశారు.
పళని-పన్నీర్ వర్గంలో మరింత మంది స్లీపర్ సెల్స్ ఉన్నారని.. వారంతా త్వరలో దినకరన్ గూటికి చేరతారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.దీంతో రానున్న కాలంలో అన్నాడీఎంకే ప్రభుత్వానికి మరిన్ని చిక్కులు తప్పేలా కనిపించడం లేదు.
తమిళనాట రాజకీయ సంక్షోభంపై జోక్యం చేసుకోవాలని ప్రతిపక్ష డీఎంకే, కాంగ్రెస్ డిమాండ్ చేయగా పళని వ్యతిరేక, దినకరన్ అనుచర ఎమ్మెల్యేలు సైతం వారితో గొంతు కలుపుతున్నారు. మరోవైపు పళని స్వామి సహా నేతలంతా కీలక బాధ్యతల నుంచి తొలగిస్తూ వస్తున్న దినకరన్ నేడు మరోకరిపై వేటు వేశారు. విద్యుత్ శాఖ మంత్రి పి తంగమణిని నమక్కల్ జిల్లా సెక్రటరీ పదవి నుంచి తొలగిస్తూ ఆ స్థానంలో అనబఝన్ను నియమించారు.