తిరుమలలో మద్యం సీసాల వ్యవహారంపై తనపై జరుగుతున్న ప్రచారాన్ని వైసీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. మద్యం సీసాలు పెట్టింది వైసీపీ కార్యకర్తనే అన్నట్లు తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. గత ఏడాదిన్నర కాలంగా బీఆర్ నాయుడు అనుచరులే తిరుమలలో అరాచకాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
తిరుమలలో ఇప్పటికే అక్కడే ఉన్న ఖాళీ మద్యం సీసాలను కోఠి అనే వ్యక్తి వీడియో తీసినట్లు భూమన వెల్లడించారు. ఆ ఘటనను ఆసరాగా చేసుకుని, పోలీసులు పచ్చి అబద్దాలు చెప్పించి తమపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆయన విమర్శించారు. ఇది పూర్తిగా రాజకీయ కక్షతో చేసిన కుట్రగా ఆయన అభివర్ణించారు.
ఈ వ్యవహారంలో నిజాలు బయటకు రావాలంటే, ఎక్కడో దూరంలో ఉన్న సీసీ ఫుటేజ్ను కాకుండా, ఘటన చోటు చేసుకున్న ప్రాంతానికి దగ్గరలోని సీసీ ఫుటేజ్ను పోలీసులు వెంటనే విడుదల చేయాలని భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. నిజం వెలుగులోకి వస్తే ఎవరు బాధ్యులో ప్రజలే తేలుస్తారని ఆయన స్పష్టం చేశారు.
Also Read:అగ్రికల్చర్ యూనివర్సిటీలో ప్రశ్నాపత్రం లీక్!

