టీఆర్ఎస్‌ కంచుకోట..భువనగిరి ఖిల్లా

409
boora narsaiah goud
- Advertisement -

సార్వత్రిక ఎన్నికలకు మరో రెండు నెలలు సమయం ఉండగానే రాష్ట్రంలో రాజకీయం వేడిరాజుకుంది. రాష్ట్రంలో ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్ లు ఇప్పటి నుంచి ప్రచారాలు చేస్తున్నాయి. రాష్ట్రంలో ఉన్న 17పార్లమెంట్ స్దానాల్లో భువనగిరి ఒకటి. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది భువనగిరి పాంత్రం. ఎంతో మంది కళాకారులు, ఉద్యమకారులను పరిచయం చేసింది ఈ భువనగిరి ఖిల్లా. భువనగిరి కోటకు వందల ఏళ్ల చరిత్ర ఉంది. నల్గొండ జిల్లాలోని చారిత్రక కట్టడాలు కోటల్లో భువనగిరి ఒకటి.

భాగ్యనగరానికి కూతవేటు దూరంలో వరంగల్ జాతీయ రహదారి ప్రక్కనే ఉంది. 10వ శతాబ్దంలో కళ్యాణ చాళుక్యుల ఆరవ రాజు రాజా త్రిభువన మల్లు విక్రమాదిత్యుని పేరుతో భువనగిరి ప్రసిద్దిగాంచింది. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం 2008సంవత్సరం లో ఏర్పడింది. 2019లో జరిగే సాధారణ ఎన్నికల్లో ఈ పార్లమెంట్‌ స్ధానం పరిధిలో పోటీ ప్రధానంగా కాంగ్రెస్‌,
టీఆర్‌ఎస్‌ పార్టీల మధ్యే ఉండబోతున్నా మిగతా పార్టీలు కూడా వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నాయి. భువనగిరి లోకసభ సెగ్మెంట్ నాలుగు జిల్లాలను ఆనుకొని ఉంటుంది.

హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్, నల్లగొండ జిల్లాలోని ప్రాంతాలను కలుపుతూ ఈపార్లమెంట్ స్ధానాన్ని ఏర్పాటుచేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ ఈప్రాంతానికి ఎంపీలుగా పనిచేశారు. ఈ భువనగిరి పార్లమెంట్ పరిధిలో మొత్తం 7నియోజకవర్గాలు ఉన్నాయి. ఇబ్రహింపట్నం, మునుగోడు, భువనగిరి, నకిరేకల్, తుంగతుర్తి, ఆలేరు, జనగాం నియోజకవర్గాలు ఈపార్లమెంట్ స్దానంలో ఉన్నాయి. ఈ పార్లమెంట్‌ సెగ్మెంట్ పరిధి అనేక విశిష్టతలకు నెలవైంది. తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత పవిత్రమైన శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహా స్వామి దేవాలయం ఈ భువనగిరి పార్లమెంట్ ప్రాంతంలో ఉంది. అలాగే జనగామ జిల్లాలోని జిడికల్ జాతర కూడా చాలా ప్రాముఖ్యత కలిగిన ప్రాంతం. మావోయిస్టులలో కీలక పాత్ర పోషించిన సాంబశివుడు కూడా ఈప్రాంతానికి చెందిన వాడే. ప్రముఖ గాయకురాలు విమలక్క, తెలంగాణ గానకోకిల బెల్లి లలిత పలువురు ప్రముఖులు ఈప్రాంతంలోనే జన్మించారు.

1947-48లో రజాకార్లకు ఎదురుతిరిగిన బైరాన్ పల్లి బురుజు కూడా పార్లమెంట్ స్ధానంలోనే ఉంది. 1948 ఆగస్టు 27న బైరాన్‌పల్లిలో నరమేధం జరిగింది.సాయుధ పోరులో 118 మంది వీరమరణం పొందారు. ఒగ్గుకథ సృష్టికర్త చుక్క సత్తయ్య కూడా భువనగిరి పార్లమెంట్ సెగ్మెంట్ కు చెందినవాడు. ఇలా ఎంతో మంది ప్రముఖులను జన్మనిచ్చింది ఈభువనగిరి పార్లమెంట్ సెగ్మెంట్. హస్తకళలకు ప్రసిధ్ది గాంచిన పెంబర్తి లొహ హస్తకళలు కూడా ఈపార్లమెంట్ లోనే ఉన్నాయి. ఇక్కడ తయారైన కళాత్మక వస్తువులను అమెరికా, జర్మనీ, బెల్జియం, జపాన్ దేశాలు దిగుమతి చేసుకుంటున్నాయి. ఈ భువనగిరి పార్లమెంట్ స్ధానానికి ఆనుకుని నల్లగొండ, వరంగల్, మల్కాజ్ గిరి, రంగారెడ్డి పార్లమెంట్ స్ధానాలు ఉన్నాయి. ఈ పార్లమెంట్‌ స్థానం పరిధిలో మొత్తం 1,492,251 మంది ఓటర్లు ఉన్నారు.

భువనగిరి పార్లమెంట్ పరిధిలో వరి, పత్తి, చెఱుకు, మొక్కజొన్న, పెసర, శనగ వంటి పంటలను పండించడంతో పాటు కూరగాయల సాగు కూడా పెద్ద మొత్తంలో చేస్తారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక భువనగిరిని జిల్లాగా ఏర్పాటు చేసింది రాష్ట్ర్ర, ఈ ప్రాంతానికి పక్కనే యదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఉండటంతో ఈజిల్లాకు యాదాద్రి భువనగిరి అని నామకరణం చేశారు
.భువనగిరి పార్లమెంట్‌ నియోజకవర్గం 2008వ సంవత్సరంలో ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఇద్దరూ ఈనియోజకవర్గానికి ఎంపీలుగా ఉన్నారు .

2009సంవత్సరంలో మొట్టమొదటి సారి ఈ నియోజకవర్గం లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ , టీడీపీ, సీపీఐ(ఎం) మహాకూటమి తరపున పోటీ చేసిన నోముల నర్సింహాయ్యపై కాంగ్రెస్ అభ్యర్ధి కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయం సాధించారు. 2014సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పై టీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధి డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ విజయం సాధించారు. ఎంపీగా గెలిచినప్పటినుంచి పార్లమెంట్ లో తెలంగాణ వాణిని బలంగా వినిపిస్తున్నారు ఎంపీ బూరనర్సయ్య గౌడ్.

2019సంవత్సరంలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో కూడా భువనగిరి ఖిల్లాపై మరోసారి టీఆర్ఎస్ జెండా ఎగురనుందనడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే భువనగిరి పార్లమెంట్ లోని 7 నియోజకవర్గాల్లోని 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తెలంగాణ ప్రజల సమస్యలను పార్లమెంట్ లో బలంగా వినిపించారు ఎంపీ బూర నర్సయ్య గౌడ్. అంతే కాకండా తన నియోజకవర్గంలో ఎంతో మందికి ఉచితంగా ఆపరేషన్లు చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. రాష్ట్రానికి ఎయిమ్స్ తీసుకురావడంలో బూర నర్సయ్య గౌడ్ కీలక పాత్ర పోషించారు. తన నియోజకవర్గంలోని ప్రతి ప్రభుత్వ ఆసుపత్రి ముందు తన సొంత ఖర్చులతో బస్ షెల్టర్ ను నిర్మించారు. మరోవైపు కాంగ్రెస్ లో టీఆర్ఎస్ ను తట్టుకోగలిగే నాయకుడు కూడా లేకపోవడం గమనార్హం. భువనగిరి పార్లమెంట్ స్ధానం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసేందుకు ప్రముఖ నాయకులు ఎవరూ ముందుకు రావడం పోవడం విశేషంగా చెప్పుకోవచ్చు. ఎంపీ బూర నర్సయ్య గౌడ్ చేసిన మంచి పనులే ఆయన్ను మరోసారి గెలిపిస్తాని చెప్పుకోవచ్చు.

- Advertisement -