బ్లాక్ మనీని అరికట్టేందుకు రూ.500. రూ.1000 లను కేంద్రం బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం బ్యాంకులు, ఏటీఎంలకు సెలవు దినంగా ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. బ్యాన్ చేసిన నోట్లను మార్పిడి చేసేందుకు గురువారం నుండి బ్యాంకులు ఒపెన్ చేయనున్నారు. ఇప్పటికే పెద్ద నోట్ల బ్యాన్తో పలు సమస్యలు ఎదుర్కొంటున్న ప్రజలు.. తమ దగ్గరున్న పెద్ద నోట్లను మార్పిడి చేసుకునేందుకు సిద్దమవుతున్నారు. నోట్లను మార్చుకునేందుకు బ్యాంకులకు పెద్ద ఎత్తున రద్దీ రానున్న క్రమంలో దేశంలో ఉన్న బ్యాంకులన్నీ ఈ ఆది, సోమవారాలు కూడా పని చేస్తాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఇప్పటికే వివిధ బ్యాంకులు తమ ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నాయి. ఎలాంటి ఆవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు రక్షణ కూడా బ్యాంకుల్లో ఏర్పాటు చేస్తున్నారు బ్యాంకు అధికారులు.
ఇక ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.500, రూ. 1000 నోట్ల చలామణి రద్దుపై ఆందోళన చెందాల్సి అవసరం లేదన్న సంకేతాలు అందించింది. పెద్ద కరెన్సీ నోట్ల రద్దుతో తమ అన్ని బ్రాంచ్ లోలనూ, ఏటీ ఎం కేంద్రాలలోనూ సరిపడినన్ని 100 రూపాయల నోట్ల నిల్వలు రడీగా ఉన్నాయని అధికారికంగా ప్రకటించింది. నవంబరు 11 నుంచి ఏటీఎం కేంద్రాలు సిద్ధంగా ఉంటాయని తెలిపింది. దాదాపు అన్ని బ్యాంకులు సాయంత్రం ఆరుగంటల వరకు తమ బ్యాంకులు పని చేస్తాయని, 10 వేల వరకు విత్ డ్రా చేసుకోవచ్చని ఎస్బీఐ ప్రకటించింది. అలాగే తమ ఖాతాల్లో రూ.500, రూ. 1000 నోట్ల డిపాజిట్లకు ఎలాంటి లిమిట్ లేదని వెల్లడించింది.
కాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంచలన నిర్ణయంతో తాజాగా 100 నోటు ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. రూ.500, రూ. 1000 నోట్ల చలామణి రద్దు చేయడంతో ప్రజల్లో రూ.100 నోటుపై విపరీతమైన క్రేజ్ పెరిగిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.