ప్రస్తుతం ‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్’ ఎన్నికలు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారాయి. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు పోటీలోకి దిగుతున్నారు. అక్టోబర్ 10న జరగనున్న ‘మా’ ఎన్నికలకు ఇప్పటికే తన ప్యానల్ని ప్రకటించిన ప్రకాష్ రాజ్.. విజయం సాధించేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఇందులో భాగంగానే ఆయన ఆదివారం సినీ కళాకారులందరికీ విందు ఏర్పాటు చేసినట్లు సమాచారం. అయితే ఈ విందు ఏర్పాటుపై నటుడు,నిర్మాత బండ్ల గణేష్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు.
ఎన్నికల ప్రచారం పేరుతో కళాకారులందర్నీ ఒకచోటకు చేర్చి వారి జీవితాలతో చెలగాటాలాడొద్దని బండ్ల అన్నారు. పోటీదారులందరూ తాము చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి ‘మా’ సభ్యులకు ఫోన్ చేసి వివరించండి.. కానీ, విందులు, పార్టీల పేరుతో వారిని ఒకే చోటకు చేర్చకండి అంటూ గణేష్ విజ్ఞప్తి చేశారు. ఈ ఏడాది జరగనున్న ‘మా’ ఎన్నికల్లో జనరల్ సెక్రటరీ పదవి కోసం పోటీ చేసేందుకు సిద్ధమైన గణేష్ తాజాగా ట్విటర్ వేదికగా ఓ వీడియో రిలీజ్ చేశారు.