సాగర్ ఉప ఎన్నికల వేళ బీజేపీలో అంతర్గత కుమ్ములాటాలు బహిర్గతమయ్యాయి. టికెట్ ఆశించిన నేతలకు భంగపాటు తప్పకపోవడం…ఎవరూ ఉహించని విధంగా రవికుమార్కు బండి సంజయ్ సీటు కేటాయించడంతో సాగర్ కమలం నేతలకు నిరాశే మిగిలింది.
ముఖ్యంగా సాగర్ ఇంఛార్జీగా ఉన్న నివేదిత రెడ్డి కంకనాల టికెట్పై గంపెడాశలు పెట్టుకున్నారు. సాగర్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందు నుండే గ్రామా గ్రామాలకు తిరిగి తానే అభ్యర్థినని ప్రచారం చేసుకున్నారు. ఇక నోటిఫికేషన్ వెలువడిన తర్వాత ఓ అడుగు ముందుకేసి ప్రచార రథాలు సిద్ధం చేసుకున్నారు. పార్టీ ఓటు బ్యాంకు లేకపోయిన ఉరూరా తిరిగి అంతోఇంతో మద్దతు కూడగట్టారు. పార్టీ అభ్యర్థిని ప్రకటింకపోయినా తానే బీజేపీ అభ్యర్థినని నామినేషన్ కూడా దాఖలు చేశారు. చివరకు బండి …నివేదితకు హ్యాండ్ ఇచ్చి రవికుమార్ను బరిలో దింపారు. దీంతో నివేదితకు గట్టి షాక్ తగలింది. బండి నమ్ముకున్నందుకు తమకు బండే మిగిలిందని ఆమె వర్గీయులు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు.
ఇక యాదవ సామాజిక వర్గానికి చెందిన మరో కీలక నేత కడారి అంజయ్య సైతం పార్టీపై తిరుగుబాటు జెండా ఎగురవేశారు. రవికుమార్కు టికెట్ కేటాయించడాన్ని నిరసిస్తూ బీజేపీని వీడి టీఆర్ఎస్లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. దీంతో సాగర్ ఎన్నికలకు ముందే బీజేపీకి గట్టి షాక్ తగిలినట్లైంది.