బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ జైలు నుంచి రిలీజ్ అయ్యారు. ఆయనకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేయడంతో ఇవాళ ఉదయం జైలు నుండి బయటకు వచ్చారు. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా నమోదైన కేసులో అరెస్టయ్యారు. ఈ కేసును అక్రమంగా పెట్టినదిగా ఆయన అనుచరులు ఆరోపిస్తున్నారు.
ఆదిలాబాద్ జిల్లా జైలులో ఉన్న బాల్క సుమన్కు సంబంధించి జిల్లా సెషన్స్ కోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. అయితే చెన్నూర్ కోర్టులో నమోదైన మరో కేసులో పీటీ వారెంట్ పిటిషన్ పెండింగ్లో ఉండటంతో వెంటనే విడుదల కాదని మొదట భావించారు. ఆ పిటిషన్పై విచారణను ఈ నెల 5వ తేదీకి వాయిదా వేయడంతో ఆయన విడుదల ఆలస్యం అవుతుందని అనుకున్నారు.
కానీ బాల్క సుమన్ తరఫు న్యాయవాదులు వెంటనే చర్యలు తీసుకుని, పీటీ వారెంట్ పిటిషన్పై ముందస్తు విచారణ జరపాలని మరో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై స్పందించిన చెన్నూర్ కోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. ఇరు వర్గాల వాదనలు విన్న అనంతరం కోర్టు బాల్క సుమన్కు ఆ కేసులో కూడా బెయిల్ మంజూరు చేసింది.
దీంతో బుధవారం బాల్క సుమన్తో పాటు అదే కేసులో అరెస్టైన ఇతర బీఆర్ఎస్ నాయకులు జైలు నుంచి విడుదలయ్యారు. ఆయన విడుదలతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.
Also Read:విజయ్ – రష్మికా రిసెప్షన్..కండీషన్స్ అప్లై!

