శ్రీవారి అనుగ్రహంతో సృష్టిలోని సకల జీవరాశులు సుభిక్షంగా ఉండాలని, సకల కార్యాలు సిద్ధించాలని ప్రార్థిస్తూ తిరుమల నాదనీరాజనం వేదికపై సోమవారం ఉదయం 7 నుండి 9 గంటల వరకు 4వ విడత అయోధ్యకాండ అఖండ పారాయణం భక్తజనరంజకంగా జరిగింది. హనుమత్ సమేత సీతారామలక్ష్మణుల ఉత్సవమూర్తుల సమక్షంలో కార్యక్రమం ఆద్యంతం రామనామస్మరణతో సాగింది.
ఇందులో 12, 13వ సర్గలలోని 142 శ్లోకాలను పారాయణం చేశారు. యోగవాసిష్టం – ధన్వంతరి మహామంత్రం 25 శ్లోకాలు పారాయణం చేశారు. వేద పండితులు అఖండ పారాయణం చేయగా పలువురు భక్తులు భక్తిభావంతో వారిని అనుసరించి శ్లోక పారాయణం చేశారు.
ధర్మగిరి వేద పాఠశాల పండితులు ఆచార్య రామానుజాచార్యులు, అనంత గోపాల కృష్ణ, పివిఎన్ఎన్.మారుతి శ్లోక పారాయణం చేశారు. అఖండ పారాయణంలో ధర్మగిరి వేద పాఠశాల, ఎస్వీ వేద విశ్వవిద్యాలయం అధ్యాపకులు, ఎస్వీ ఉన్నత వేద అధ్యయన సంస్థకు చెందిన వేద పారాయణ దారులు, రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయానికి చెందిన పండితులు పాల్గొన్నారు.
పారాయణం ప్రారంభానికి ముందు టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు శ్రీమతి లావణ్య బృందం ” ఓ రామ నీ నామమేమి రుచిరా…” చివర్లో ” రామ రామ రత్న జతిత సింహాసన…” భజన కీర్తనలను వీనులవిందుగా ఆలపించారు.
Also Read:ఓ.. ప్రగ్యా జైస్వాల్ కి ఛాన్సొచ్చింది

