సోనూసూద్‌కు అరెస్టు వారెంట్‌ జారీ!

3
- Advertisement -

నటుడు సోనూ సూద్‌కు అరెస్ట్ వారెంట్ జారీ అయింది. పంజాబ్‌లోని లుథియానా కోర్టు నుంచి సినీనటుడు సోనుసూద్‌కు అరెస్ట్‌ వారెంట్‌ జారీ అయింది. ఓ కేసులో వాంగ్మూలం ఇవ్వడానికి సోనూసూద్‌ రాకపోవడంతో ముంబైలోనిఒషివారా పీఎస్‌కు లుథియానా జ్యుడిషియల్‌ మెజిస్ట్రేట్ రమన్‌ప్రీత్‌ కౌర్‌ ఈ వారెంట్‌ జారీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సోనూసూద్‌ను అరెస్టు చేసి, న్యాయస్థానంలో ప్రవేశపెట్టాలని ఆదేశించారు.

మోహిత్‌ శర్మ అనే వ్యక్తి తనను రూ.10 లక్షల మోసానికి గురి చేశాడని లుథియానాలోని లాయర్‌ రాజేశ్‌ ఖన్నా న్యాయస్థానంలో కేసు వేశారు. రిజికా కాయిన్‌ పేరుతో ఇన్వెస్ట్‌మెంట్‌ చేయించి, ఈ మోసానికి పాల్పడ్డాడని, దీనికి సోనూసూద్‌ సాక్షి అని చెప్పారు. దీనిపై న్యాయస్థానం వాంగ్మూలం ఇవ్వాలని పలుసార్లు సోనూసూద్‌కు సమన్లు పంపింది.

అయితే న్యాయస్థానం ముందు హాజరుకాకపోవడంతో నాన్‌ బెయిలబుల్‌ అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేస్తున్నట్లు మేజిస్ట్రేట్‌ చెప్పారు. ఫిబ్రవరి 10న ఈ కేసు న్యాయస్థానంలో మరోసారి విచారణకు వస్తుంది.

Also Read:కేబినెట్ విస్తరణ.. ముహుర్తం ఖరారు!

- Advertisement -