ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రవ్యాప్తంగా సచివాలయ సిబ్బందికి ఫేషియల్ అటెండెన్స్ విధానాన్ని అమలు చేయాలని సర్కార్ నిర్ణయించింది. ఉద్యోగుల సమయపాలనపై కఠిన నిబంధనలు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నిర్ణయంతో ముఖ్యంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు విధులకు కచ్చితమైన సమయానికి హాజరుకావాల్సి ఉంటుంది.
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం, నిర్ణయించిన సమయానికి హాజరు నమోదు చేయని ఉద్యోగులపై చర్యలు తప్పవని స్పష్టం చేసింది. ఆలస్యంగా విధులకు హాజరయ్యే సిబ్బందికి ఆ రోజు వేతనంలో కోత విధించేలా మార్గదర్శకాలు రూపొందించారు. ఫేషియల్ అటెండెన్స్ ద్వారా ఉద్యోగుల హాజరును ఖచ్చితంగా నమోదు చేసి, తప్పిదాలకు అవకాశాలు లేకుండా చేయడమే ప్రభుత్వ ఉద్దేశమని అధికారులు తెలిపారు.
గ్రామ, వార్డు సచివాలయాలు ప్రజలకు నేరుగా సేవలు అందించే కీలక కేంద్రాలైనందున, అక్కడ పనిచేసే ఉద్యోగుల సమయపాలన ఎంతో ముఖ్యమని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. ప్రజలు ఉదయం నుంచే సేవల కోసం సచివాలయాలకు వస్తుండటంతో, సిబ్బంది ఆలస్యం ప్రజలకు ఇబ్బందిగా మారుతోందన్న ఫిర్యాదులు అందుతున్నాయని సమాచారం.
ఈ సంస్కరణల ద్వారా సచివాలయ వ్యవస్థను మరింత పటిష్టం చేయడం, ఉద్యోగుల్లో బాధ్యతా భావాన్ని పెంచడం, ప్రజలకు వేగంగా మరియు పారదర్శకంగా సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
Also Read:‘కనుమ’..ఎందుకు జరుపుకుంటారు?

