Congress: ఏపీలో కాంగ్రెస్..తొమ్మిది గ్యారెంటీలు!

10
- Advertisement -

మే 13న సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్న సంగతి తెలిసిందే. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారం చేపట్టాలని అన్ని పార్టీలు పట్టుదలగా ఉన్నాయి. వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలతో పాటు బీజేపీ కాంగ్రెస్ పార్టీలు కూడా ఈసారి ఎలక్షన్ రేస్ లో ఉన్నాయి. మిగిలిన పార్టీలతో పోల్చితే ఈసారి ఏపీ అసెంబ్లీ ఎన్నికలను కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 2014 తర్వాత ఏపీలో పూర్తిగా అంతరించిపోయిన కాంగ్రెస్.. ఈ సారి ఎన్నికలతోనైనా పునర్జీవం పోసుకోవాలని చూస్తోంది. అందులో భాగంగానే వైఎస్ షర్మిల కు అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే షర్మిల పార్టీ బలోపేతం కోసం గట్టిగానే ప్రయత్నిస్తోంది. ఇకపోతే ఏపీ ప్రజలను ఆకర్శించేందుకు హస్తం పార్టీ వ్యూహాత్మకంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. .

తెలంగాణ, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో అనుసరించిన వ్యూహాన్నే ఏపీలో కూడా అమలు చేసేందుకు సిద్ధమైంది. కర్నాటకలో ఐదు గ్యారెంటీలు, తెలంగాణలో ఆరు గ్యారెంటీల పేరుతో హామీలిచ్చి అధికారం సాధించింది హస్తం పార్టీ. ఇప్పుడు ఏపీలో కూడా గ్యారెంటీల పేరుతో హామీలిచ్చేందుకు కాంగ్రెస్ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఏపీలో ఏకంగా తొమ్మిది గ్యారెంటీలను అమలు చేస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. పదేళ్ళు ప్రత్యేక హోదా, మహిళలకు ప్రతి నెల రూ. 8,500, రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, 50 శాతం లాభంతో మద్దతు ధర, ఉపాధి హామీలో కనీస వేతనం రూ. 400, 2.25 లక్షల ఉద్యోగాల భర్తీ, మహిళల పేరు మీద రూ.5 లక్షల విలువైన ఇల్లు, అర్హులైన ప్రతి ఒక్కరికీ రూ.4 వేల పెన్షన్.. ఇలా తొమ్మిది గ్యారెంటీలను ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ.

దీంతో పొరుగు రాష్ట్రాల్లో ప్రభావం చూపిన విధంగా ఏపీలో కూడా కాంగ్రెస్ గ్యారెంటీలు ప్రభావం చూపే అవకాశం ఉందా అనేది హాట్ హాట్ చర్చలకు దారి తీస్తోంది. అయితే ఏపీలో కాంగ్రెస్ పార్టీకి చెప్పుకోదగ్గ స్థాయిలో బలం లేదు. అందువల్ల ఆ పార్టీ ఎన్ని హామీలిచ్చిన హస్తం పార్టీని ప్రజలు పట్టించుకునే అవకాశం లేదనేది కొందరి అభిప్రాయం. మరి పూర్వ వైభవం కోసం ఆరాట పడుతున్న కాంగ్రెస్ కు తొమ్మిది గ్యారెంటీలు ఎంతవరకు హెల్ప్ అవుతాయో చూడాలి.

Also Read:సుహాస్ హీరోగా.. ‘ఓ భామ అయ్యో రామ’

- Advertisement -