ప్రేక్షకులను ఆకట్టుకునే..’ఉపేంద్ర గాడి అడ్డా’

7
- Advertisement -

పూర్తి వినోదం, మాస్ అంశాలతో ఆద్యంతం ప్రేక్షకులను సమ్మోహనపరిచేవిధంగా “ఉపేంద్ర గాడి అడ్డా” చిత్రం రూపొందిందని నిర్మాత కంచర్ల అచ్యుతరావు స్పష్టం చేశారు.కంచర్ల ఉపేంద్ర హీరోగా, సావిత్రి కృష్ణ హీరోయిన్ గా, ఆర్యన్ సుభాన్ ఎస్.కె. దర్శకత్వంలో ఎస్. ఎస్.ఎల్.ఎస్. (SSLS) క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రం టీజర్ ను హైదరాబాద్, ప్రసాద్ ల్యాబ్ లో జరిగిన వేడుకలో ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత కంచర్ల అచ్యుతరావు మాట్లాడుతూ, “మొదట్నుంచి నాకు సినిమా పిచ్చి ఉండేది. విడుదలైన అన్ని సినిమాలు చూస్తూండేవాడ్ని. అయితే నేను ఇతర వ్యాపార రంగాలలో బిజీ కావడంతో ఇంతకాలం సినిమా రంగంలోనికి ప్రవేశించలేదు. అయితే సినీ హీరో కావాలన్న మా అబ్బాయి ఉపేంద్ర తృష్ణను గమనించి, అతనిని హీరోగా పరిచయం చేస్తూ, ఐదు సినిమాలను మొదలు పెట్టాం. అవన్నీ వివిధ దశలలో ఉన్నాయి. ఐదవ సినిమాగా మొదలు పెట్టిన ఈ సినిమా చాలా వేగంగా పూర్తయి, మొదటి సినిమాగా విడుదలకు సిద్ధమైంది. ఇటీవల చివరి పాటను ఊటీలో చిత్రీకరించడంతో షూటింగ్ మొత్తం పూర్తయింది. ఈ నెల 29న మా అబ్బాయి పుట్టినరోజున ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్ లో భారీ ఎత్తున నిర్వహించబోతున్నాం. అదేరోజున ఈ చిత్రం ట్రైలర్ ను కూడా విడుదల చేస్తాం. నవంబర్ లో ఈ సినిమాను విడుదల చేయడంతో పాటు మిగతా మేము తీస్తున్న సినిమాలను ప్రతీ నెలా ఒక సినిమా చొప్పున విడుదల చేస్తాం” అని చెప్పారు.

దర్శకుడు ఆర్యన్ సుభాన్ ఎస్.కె. మాట్లాడుతూ, “థియేటర్ సీట్లో కూర్చున్న ప్రేక్షకుడు నవ్వు ఆపుకోలేక పొట్ట చెక్కలయ్యేవిధంగా 75 శాతం వినోదం ఈ చిత్రంలో ఉంటుంది. అలాగే మాస్ అంశాలు యువ హృదయాలను అద్భుతంగా అలరింపజేస్తాయి.. సోషల్ మీడియా నేటి సమాజాన్ని ఎంతగా ప్రభావితం చేస్తుందో తెలియంది కాదు. దానివల్ల చెడు మార్గాన్ని ఎంచుకోకుండా, మంచిని పెంపొందింపజేస్తే, సమాజం మరింత వికాసవంతం అవుతుందన్న సందేశాత్మక పాయింట్ ను కూడా ఇందులో ఆవిష్కరించాం. నిర్మాత, హీరో ఇచ్చిన సంపూర్ణ స్వేచ్ఛ, సహకారం వల్లే ఈ సినిమాను ఎంతో వేగంగా పూర్తి చేయగలిగాం” అని అన్నారు.

Also Read:దిల్ రాజు…‘ఆకాశందాటి వస్తావా’

- Advertisement -