ముంచుకొస్తున్న ఏఐ..30 కోట్ల ఉద్యోగాలు మాయం!

26
- Advertisement -

ఏఐ ఆధారిత ఆటోమేషన్ కారణంగా వచ్చే ఐదేళ్లల్లో కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోనున్నట్టు అడీకో సంస్థ తాజాగా అంచనా వేసింది. తొమ్మది దేశాల్లో 18 రంగాల్లోగల ప్రముఖ సంస్థల టాప్ ఎగ్జిక్యూటివ్‌ల అభిప్రాయాల ఆధారంగా ఓ నివేదిక విడుదల చేసింది. ఏఐ కారణంగా ఉద్యోగుల తొలగింపులు తప్పవని 41 శాతం కంపెనీలు అభిప్రాయపడ్డట్టు తెలిపింది.

వాస్తవానికి దగ్గరగా ఉండే వీడియోలు, ఇమేజీలు, టెక్స్ట్‌లు సృష్టించడంలో జెనరేటివ్ ఏఐ ఆధారిత టెక్నాలజీలు దూసుకెళుతున్న తరుణంలో… ఈ అసాధారణ టెక్నాలజీతో రోజూవారి పనులు సులభంగా, తక్కువ ఖర్చుతో పూర్తి చేయొచ్చన్న అంచనాలు ఉన్నాయి. దీంతో, ప్రస్తుతం ఉన్న అనేకమంది ఉద్యోగులు సంస్థలకు నిరుపయోగంగా, భారంగా మారనున్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఏఐ ప్రభావం అన్ని జాబ్స్‌పైనా ఉంటుంది. కొన్ని ఉద్యోగాలు కనుమరుగవుతాయి. కొత్త ఉద్యోగాలు వస్తాయి. పదేళ్ల క్రితం డిజిటల్ టెక్నాలజీ గురించి ఇలాంటి భయాలే వ్యక్తమయ్యాయి. అనేక మంది ఉద్యోగాలు కొల్పోతారన్న ఆందోళన వ్యక్తమైంది. కానీ డిజిటల్ విప్లవంతో మరెన్నో జాబ్స్ వచ్చాయి. ఏఐ విషయంలో కూడా కనుమరుగయ్యే ఉద్యోగాలు, కొత్త వాటి మధ్య సమతౌల్యం ఉంటుంది అని అడికో సీఈఓ డేనియల్ మాచుయెల్ తెలిపారు.

అయితే, ఏఐతో జాబ్స్‌లో కోతలు తప్పవన్న ఆందోళనలు ఇటీవలి పరిణామాలతో మరింత ఎక్కువయ్యాయని నిపుణులు చెబుతున్నారు. ఏఐ చాట్‌బాట్స్‌పై గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు దృష్టిపెడుతుండటంతో ఉద్యోగుల తొలగింపులు తప్పట్లేదని అంటున్నారు. ఏఐ వినియోగం పెరిగాక ఉద్యోగాల్లో కోతలు తప్పట్లేదని అనేక సంస్థలు ఇప్పటికే అంగీకరించాయి. ఏఐ వినియోగం పెరిగే కొద్దీ ప్రపంచవ్యాప్తంగా 30 కోట్ల జాబ్స్ కనుమరుగుకావచ్చని ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ గోల్డ్‌మన్ సాక్స్‌కు చెందిన నిపుణులు గతంలోనే అంచనా వేశారు. అయితే, వచ్చే ఐదేళ్లల్లోనే ఈ పరిస్థితి దాపురించొచ్చని అడికో సర్వే అంచనా వేస్తోంది.

Also Read:2029 నో ఎలక్షన్స్..మోడీ ప్లాన్ అదే!

- Advertisement -