దాదాపు అన్ని ప్రభుత్వ పథకాలకు ఆధార్ కార్డు నమోదును కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మరణ నమోదుకు కూడా ఆధార్ నంబర్ను మాండేటరీ చేస్తూ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. అక్టోబరు 1 2017 నుంచి ఇది అమలు కానుంది హోం మంత్రి త్వశాఖ ప్రకటించింది. ఐడెంటిటీని గుర్తించడంలో అక్రమాలను, మోసాలను నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని హోమ్ మంత్రిత్వశాఖ తెలిపింది.
దీని ప్రకారం.. చనిపోయిన వ్యక్తి తాలూకు మరణ ధ్రువీకరణ పత్రాన్ని తీసుకోవాలంటే సదరు వ్యక్తి ఆధార్ నంబర్ను లేదా ఆధార్ కోసం దరఖాస్తు చేసుకున్న నమోదు గుర్తింపు సంఖ్య ను అధికారులకు తెలియజేయాల్సి ఉంటుంది. చనిపోయిన వ్యక్తికి ఆధార్ నెంబర్ లేకపోతే.. ఆ విషయాన్ని ధ్రువీకరిస్తూ ఒక పత్రాన్ని సమర్పించాలి.మరణించిన వ్యక్తి సంబంధీకులు ఇచ్చే సమాచారాన్ని కచ్చితంగా నిర్ధారించుకొని, మరణ ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేయటానికి ఆధార్ తోడ్పడుతుందని ఈ నోటిఫికేషన్లో తెలిపారు. చనిపోయిన వ్యక్తుల వివరాల నమోదుకు, గుర్తింపునకు సంబంధించిన మోసాలను అరికట్టేందుకు ఇది మేలైన పద్ధతని పేర్కొన్నారు. ఆధార్ ఉంటే.. గుర్తింపును నిర్ధారించేందుకు ఇతర ఏ పత్రాలూ అవసరం లేదని వివరించారు.
మరణ ధ్రువీకరణ పత్రాల జారీకి ఆధార్ను తప్పనిసరి చేస్తూ విడుదల చేసిన నోటిఫికేషన్కు అనుగుణంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు చర్యలు తీసుకోవాలని, దీనికి సంబంధించిన సమాచారాన్ని సెప్టెంబర్ 1లోపు తమకు తెలియజేయాలని ఆర్జీఐ పేర్కొంది. ప్రస్తుతానికి ఈ నిబంధన జమ్ముకశ్మీర్, అసోం, మేఘాలయ రాష్ట్రాలకు తప్ప మిగతా అన్ని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు వర్తిస్తుంది. ఈ మూడు రాష్ట్రాలకు తర్వాత నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. కాగా ప్రభుత్వ, ప్రభుత్వేతర బ్యాంకు ఖాతాలు, సేవలు, బీమా, పన్నుల సేవలతోపాటు రాయితీ లబ్ధి, పింఛన్లు, ఉపకార వేతనాలు, సామాజిక పథకాల లబ్ధి, విద్య, ఉద్యోగం, ఆరోగ్యరక్షణ, మొబైల్ నెంబర్ వగైరాలకు ఆధార్ అనుసంధానం తప్పనిసరి. అలాగే అక్రమ సంపాదనకు, బినామీ ఆస్తులకు చెక్పెట్టే యోచనలో భాగంగా ఆదాయ పన్ను దాఖలు కూడా ఆధార్ను తప్పని సరి చేసింది.

