- Advertisement -
అవగాహన రాహిత్యంతో బాల్య వివాహాలు ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. కర్నూలు జిల్లా కర్ణాటక సరిహద్దు మండలమైన కౌతాళంలోని ఓ కుగ్రామంలో వింత వివాహం జరిగింది. ఏప్రిల్ 27న జరిగిన ఈ వివాహం ఆలస్యంగా వెలుగులోకి వచ్చి సంచలనంగా మారింది. బాల్య వివాహాలకు పరాకాష్టగా మారిన ఈ ఘటనలో వరుడి వయసు కేవలం 13 ఏళ్లు కాగా, వధువు వయసు 23 ఏళ్లు.
తండ్రి మద్యానికి బానిస, తల్లికి తీవ్ర అనారోగ్యం. వారికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. తాను మరణిస్తే పిల్లలు ఏమవుతారనే ఆలోచనతో తల్లి పెద్ద కొడుక్కి పెళ్లిచేయాలని నిర్ణయించింది. దూరపు బంధువుల్లో ఒకమ్మాయిని చూసి ఏప్రిల్ 27న పెళ్లి తంతు ముగించారు.
దీంతో వివాహానికి వచ్చినవారంతా ఆశ్చర్యపోయారు. కొందరైతే పెళ్లి పెద్దలను తిట్టిపోశారు. ఈ వింత వివాహం చిత్రాలు సామాజిక వేదికల్లో హల్చల్ చేయడంతో ఆలస్యంగా విషయం బయటకు వచ్చింది.
- Advertisement -