ఆర్కేనగర్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభమై కొనసాగుతుంది. చెన్నైలోని క్వీన్ మేరిస్ కళాశాలలో జరుగుతున్న ఓట్ల లెక్కింపునకు ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేసింది. మొత్తం 19 రౌండ్లలో లెక్కింపు జరగనుంది. ఈ మధ్యాహ్నానికి ఫలితాలు వెల్లడి కానున్నాయి. అధికార అన్నాడీఎంకే తరపున మధుసూదనన్, శశికళ వర్గం తరపున దినకరన్, డీఎంకే నుంచి మరుదు గణేశన్, బీజేపీ నుంచి కరునాగరాజన్తో పాటు మొత్తం 59 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
ఆర్కే నగర్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపులో కొద్దిసేపు గందరగోళం చోటు చేసుకుంది. తర్వాత కౌంటింగ్ తిరిగి ప్రారంభమైంది. లెక్కింపు కేంద్రం వద్ద ఏఐఏడీఎంకే, దినకరన్ వర్గీయుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఒకరిపై ఒకరు కూర్చీలు విసురుకున్నారు. రంగంలోకి దిగిన పారామిలటరీ బలగాలు పరిస్థితిని అదుపులోకి తీసుకుంది. ప్రస్తుతం తొమ్మిదో రౌండ్ ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది.
ఆర్కేనగర్ ఉప ఎన్నికలో గెలుపు సంకేతాలు అందడంతో దినకరన్ సీన్లోకి వచ్చారు. మధుర ఎయిర్ పోర్టులో మీడియాతో మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మూడు నెలల్లో పళనిస్వామి ప్రభుత్వం పడిపోవడం ఖాయమని వ్యాఖ్యానించారు. ఆర్కేనగర్ తీర్పు, తమిళనాడు ప్రజల తీర్పు అని ఆయన అన్నారు.
ఎన్నికల్లో గెలవడానికి గుర్తు ముఖ్యం కాదని, అక్కడ నిలుచున్న వ్యక్తే ముఖ్యమని ఆయన అన్నారు. ఆదివారం సాయంత్రం జయ సమాధివద్దకు చేరుకుని దినకరన్ నివాళులర్పించనున్నారు. పోలింగ్ ముందు రోజు జయలలిత ఆస్పత్రి వీడియోను దినకరన్ వర్గం విడుదల చేసింది. తనకు తెలియకుండా జరిగిపోయిందని దినకరన్ చెబుతున్నప్పటికీ ఈ వీడియో ఆర్కేనగర్ ఓటర్లపై పెను ప్రభావం చూపిందని భావిస్తున్నారు. ఓటర్లలో దినకరన్పై సానుభూతి బాగా పనిచేసింది.