జనతా గ్యారేజ్ సినిమాతో పెద్ద విజయాన్ని అందుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ 2016 సంవత్సరాన్ని మరిచిపోలేడు. ప్రపంచవ్యాప్తంగా మొత్తంగా రూ. 125 కోట్లు వసూలు చేసిన ’జనతా గ్యారేజ్’… బాహుబలి, శ్రీమంతుడు సినిమాల తర్వాత అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాగా రికార్డు సృష్టించింది. దీంతో పవన్ కల్యాణ్ ’అత్తారింటికి దారేది’ సినిమా వసూళ్లను ’జనతా’ దాటేసిందని బాక్సాఫీస్ టాక్ ను బట్టి తెలుస్తోంది. ఇక ఈ సంవత్సరం ఎన్టీఆర్ ఇప్పటికే రూ.200 కోట్ల మార్కుని దాటి చరిత్ర సృష్టించాడు.
ప్రకృతి ప్రేమికుడిగా సరికొత్త పాత్రలో కనిపించిన తారక్.. ఇప్పటివరకు రూ. 30 కోట్ల క్లబ్లోనే ఉండిపోయేవాడు. టెంపర్ సినిమాతో ట్రాక్లోకి వచ్చిన ఎన్టీఆర్.. నాన్నకు ప్రేమతో సినిమాతో తానేంటో ఇండస్ట్రీకి చూపించాడు. సంక్రాంతికి విడుదలైన నాన్నకు ప్రేమతో రూ. 90 కోట్లకు పైగానే కలెక్ట్ చేసింది. ఇక జనతా గ్యారేజ్ 19 రోజుల్లో రూ.125 కోట్ల మార్కును చేరుకుంది. ఈ రెండు సినిమాల కలెక్షన్లను కలిపితే.. రూ.215 కోట్లకు చేరింది. దీంతో ఒకే ఏడాదిలో 200 కోట్ల క్లబ్లోకి ఎక్కి చరిత్ర సృష్టించాడు.
కాగా, జనతా గ్యారేజ్ రూ. 140కోట్ల గ్రాస్, రూ. 90 కోట్ల షేర్ మార్క్ని టచ్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. జనతా గ్యారేజ్.. మహేష్ సినిమా శ్రీమంతుడిని దాటేస్తే.. టాలీవుడ్ ఆల్టైమ్ రికార్డ్ సినిమాల జాబితాలో బాహుబలి తరువాత రెండో స్థానం చేరుకుంటుంది.