జూనియర్ ఎన్టీఆర్, బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం జై లవ కుశ. గత నెలలో ఈ చిత్ర టీజర్ విడుదల చేశారు. జై అనే పాత్రకి సంబంధించిన ఈ టీజర్లో ఎన్టీఆర్ అదరగొట్టేశాడు. ఈ టీజర్క మంచి స్పందన రాబట్టుకుంది. మూడు టీజర్లలో భాగంగా రెండోది ఇంకో పది రోజుల్లోపే రాబోతున్నట్లుగా వార్తలొస్తున్నాయి. దీంతో పాటు ఆడియో వేడుకకు కూడా సన్నాహాలు మొదలైపోవడం విశేషం. తాజాగా జైలవకుశ స్టోరీ ఇదేనంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతున్న స్టోరీ ఇదేనట. ఇందులో ఎన్టీఆర్.. జై, లవ, కుశ అనే మూడు విభిన్న పాత్రలలో కనిపించనున్న విషయం తెలిసిందే . ఇందులో పెద్దవాడు జై.. కాగా తమ్ముళ్లు లవ, కుశ లు వీరిద్దరు కవలలు. కట్ చేస్తే జై, లవకుశలను చంపడానికి ప్రయత్నాలు చేస్తాడు.. ఎందుకంటే వీరు ముగ్గురు అన్నదమ్ములే కానీ.. ఒకే తల్లికి పుట్టలేదు.. ఈ ముగ్గురికి ఒకే తండ్రి ఉంటాడు. మొదటి భార్యకు జై పుట్టగా.. రెండవ భార్యకు లవకుశ లు పుడతారట.
జై చిన్నప్పుడే తల్లి చనిపోతుంది. ఇందుకు కారణం తండ్రి అనుకొని.. తండ్రిపై కోపాన్ని పెంచుకుంటాడు జై.. ఎలాగైనా తండ్రిని, ఆయన రెండో భార్య పిల్లల్ని నాశనం చేయాలని పగ పెంచుకుంటాడు.. అలా చెడు స్నేహాలు చేసి గ్యాంగ్ స్టర్గా మారతాడు జై. లవకుశలు తండ్రితో కలిసి జీవిస్తూ డ్రామా ఆర్టిస్టులుగా పని చేస్తుంటారట. తమ్ముళ్లకి అన్నయ్యకి మధ్య నడిచే ఓ యాక్షన్ ఎంటర్ టైనర్ గా జై లవకుశని తీర్చిదిద్దేందుకు చిత్ర బృందం ప్రయత్నిస్తుందని సమాచారం. ఇంతకీ ఇది జైలవకుశ స్టోరీనా.. లేదా.. తెలియాలంటే సెప్టెంబర్ 21 వరకు ఎదురు చూడాల్సిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూణేలో జరుగుతోంది. గతంలో ‘రామ్ లీలా’ షూటింగ్ జరుపుకున్న భవనంలోనే ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.