మంత్రి పదవికి కొండా రాజీనామా?

5
- Advertisement -

తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా సంచలన పరిణామాలు చోటుచేసుకున్నాయి. రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను తన మంత్రి పదవికి తక్షణమే రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం తీవ్రస్థాయిలో ఆదేశించింది. గురువారం సాయంత్రంలోగా రాజీనామా సమర్పించకపోతే ఆమెను క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేస్తూ గవర్నర్ (లోక్‌భవన్)కు సిఫార్సు లేఖ పంపిస్తామని హెచ్చరించింది.

కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్వయంగా కొండా సురేఖతో మాట్లాడి స్వచ్ఛందంగా మంత్రి పదవికి రాజీనామా చేయాలని స్పష్టం చేసినట్లు సమాచారం. పరిస్థితిని బర్తరఫ్ వరకు తెచ్చుకోవద్దని ఆమెకు సూచించారు. ఈ నిర్ణయంపై పునరాలోచించాలని సురేఖ అధిష్ఠానాన్ని వేడుకున్నప్పటికీ, పార్టీ పెద్దల నుంచి ఆమెకు ఎలాంటి ఊరట లభించలేదు. దీంతో బర్తరఫ్ వేటు వేయించుకోవడం కంటే స్వయంగా రాజీనామా చేయడమే మంచిదని ఆమె ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఆయన హైదరాబాద్ చేరుకునేలోగానే కొండా సురేఖ తన రాజీనామా లేఖను సీఎమ్‌కు లేదా రాజ్ భవన్‌కు పంపించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అధిష్ఠానం తీసుకున్న ఈ కఠిన నిర్ణయంతో కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర కలకలం రేగింది.

Also Read:తెలంగాణకు పట్టిన శని..కాంగ్రెస్

మంత్రి పదవి ఊడటంతో పాటు తలెత్తిన తాజా పరిణామాలతో కొండా సురేఖ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. మంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం తనకు, తన మద్దతుదారులకు అవమానకరమని ఆమె భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో మంత్రి పదవితో పాటు కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి, పార్టీకి గుడ్‌బై చెప్పే ఆలోచనలో కొండా సురేఖ ఉన్నట్లు సమాచారం.

- Advertisement -