వాతావరణంలో మార్పులతో రాష్ట్రంలో భారీ వర్షం కురుస్తోంది. రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా హైదరాబాద్ తో సహా మిగితా ప్రాంతాల్లో వర్షం దంచికొడుతోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.
ఉపరితల ఆవర్తనం ప్రభావంతో గడిచిన 24 గంటల్లో నల్లగొండ, మహబూబ్ నగర్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడుతున్నాయి. నల్లగొండ జిల్లా సూర్యాపేట, కోదాడలో ఓ మోస్తరు వర్షం పడింది. కరీంనగర్ లో తేలికపాటి వర్షాలు పడ్డాయి. హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. రాత్రంతా ఎడతెరిపి లేకుండా వాన దంచికోడుతోంది. కంటిన్యూగా కురుస్తున్న వర్షంతో, లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. భారీ వర్షం కారణంగా లోతట్టు కాలనీల్లోని ఇళ్లలోకి నీరు చేరింది. రోడ్లు కూడా దెబ్బతినడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో లోతట్టు ప్రాంతాలన్ని నీటమునిగాయి.
భారీగా వరద నీరు ఇళ్లలోకి చేరింది. కొన్ని ప్రాంతాల్లో ఇళ్లు మోకాలి లోతు నీటిలో చిక్కుకుపోయాయి. చాలా ప్రాంతాల్లో కాలువలను తలపిస్తున్నాయి. మియాపూర్, ఆల్వీన్ కాలనీ, నిజాంపేట్, మూసాపేట్ తో పాటు చాలా ఏరియాల ప్రజలు నీటితో ఇబ్బందులు పడుతున్నారు. ప్రగతి నగర్ చెరువు నిండటంతో అల్విన్ కాలనీ జలమయమైంది. నిజాంపేట తుర్కచెరవులోకి భారీగా వరద వస్తోంది. అల్వాల్ లో ని మోత్కులకుంట చెరువులోకి భారీగా నీరు వస్తోంది. అపార్ట్ మెంట్ల సెల్లార్లలోకి భారీగా నీరు చేరింది.
హైదరాబాద్ కుత్బుల్లాపూర్ షాపూర్ నగర్ లో అత్యధికంగా 16.4 సెంటీమీటర్లు, బొల్లారంలో 9 సెంటీమీటర్లు, మాదాపూర్ లో 7.4 సెంటీ మీటర్ల వర్షాపాతం నమోదైంది.
మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం ఉదయం వరకు నగరంలో కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు, రోడ్లు జలమయమయ్యాయి. వర్షాలతో హుస్సేన్ సాగర్లోకి భారీగా నీరు చేరడంతో అధికారులు ఎప్పటికప్పుడు నీటిని బయటకు వదులుతున్నారు. రాజేంద్రనగర్, కుత్బుల్లాపూర్, ఉప్పల్, కూకట్ పల్లి తదితర ప్రాంతాల్లో ఇళ్లల్లోకి నీరు చేరింది. దీంతో ప్రజలు ప్రత్యక్ష నరకం అనుభవిస్తున్నారు.
పంజాగుట్ట, ఎర్రగడ్డ, కూకట్ పల్లి, బేగంపేట్, ఖైరతాబాద్ ప్రాంతాల్లో కూడళ్ల వద్ద రోడ్లపై వర్షం నీరు చేరింది. అర్థరాత్రి నుంచి చాలాచోట్ల ప్రధాన మార్గాల్లో వాహనాలు నిలిచిపోయాయి. ప్రజలు వర్షపునీటిలోనే రాత్రంతా జాగారం చేస్తూ బిక్కుబిక్కుమంటూ గడిపారు. అటు రాజేంద్రనగర్, గచ్చిబౌలి, మెహిదీపట్నం, నాంపల్లి, అబిడ్స్తోపాటు పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షం కురిసింది. కుత్బుల్లాపూర్, బాలానాగర్, సనత్ నగర్, అమీర్ పేట్, మలక్ పేట్, చాదర్ ఘాట్, దిల్ షుక్ నగర్ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వాన పడింది.
అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దు : జీహెచ్ఎంసీ
అత్యవసరమైతేనే బయటకు రావాలని నగరవాసులకు విజ్ఞప్తి చేసింది జీహెచ్ఎంసీ. హైదరాబాద్ ను వరుణగండం వదలేదని వాతావరణశాఖ తెలపడంతో అప్రమత్తమయ్యారు అధికారులు. లోతట్టు ప్రాంతాలవారికి ముందస్తు సూచనలు చేశారు.
పరిస్థితిని సమీక్షించిన సీఎం కేసీఆర్
హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తున్నందున అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు సీఎం కేసీఆర్. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం.. GHMC కమిషనర్ జనార్దన్ రెడ్డితో ఫోన్లో మాట్లాడారు. హైదరాబాద్ లో పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. హుస్సేన్ సాగర్ తోపాటు.. నగరంలోని చెరువుల కుంటల పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు.