డిజిటల్ అరెస్ట్..రూ. 50 లక్షలు కొట్టేశారు!

3
- Advertisement -

డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ నేరగాళ్లు మరోసారి పంజా విసిరారు. తాజాగా పుణెకు చెందిన 84 ఏళ్ల వయోవృద్ధుడు, ఆయన భార్య ఒక నేర దర్యాప్తులో భాగస్వాములుగా ఉన్నారంటూ కేటుగాళ్లు నమ్మించి వారి నుంచి రూ. 50.50 లక్షలు కాజేశారు. జూలై 13, 2026న లక్నోకు చెందిన ఏటీఎస్ (ATS), సీఐడీ (CID) అధికారులమని చెబుతూ అంతర్జాతీయ నంబర్ నుండి వచ్చిన వాట్సాప్ వీడియో కాల్ ద్వారా స్కామర్లు బాధితుడిని సంప్రదించారు.

ఒక నేరపూరిత కేసులో బాధితుడి ఆధార్ వివరాలు బయటపడ్డాయని ఫ్రాడ్‌స్టర్లు నమ్మించారు. ఆ నేరానికి సంబంధించిన డబ్బు బాధితుడి బ్యాంక్ ఖాతాలో జమ అయిందని, ఆయనను మరియు ఆయన భార్యను అరెస్టు చేస్తామని బెదిరించారు. తమ తప్పుడు ఆరోపణలను నిజమని నమ్మించడానికి అరెస్ట్ వారెంట్ మరియు ఆస్తి జప్తు ఉత్తర్వులతో కూడిన అధికారిక నోటీసుల వలె కనిపించే పత్రాల చిత్రాలను స్కామర్లు పంపారు. అంతకముందే వారు ఆ దంపతుల పొదుపు ఖాతాలు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు , ఇతర ఆర్థిక ఆస్తుల వివరాలను సేకరించారు.

బాధితుల ఫోన్లు నిఘాలో ఉన్నాయని చెబుతూ కేటుగాళ్లు వారిపై నిరంతరం ఒత్తిడి పెంచారు. ఫోన్లను స్విచ్ ఆఫ్ చేయవద్దని ఈ విషయాన్ని ఎవరితోనూ చర్చించవద్దని, ఎవరైనా సంప్రదించినా లేదా ఇంటికి వచ్చినా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఈ కేసుతో సంబంధం ఉన్న ఇతర నిందితులు వారికి హాని తలపెట్టవచ్చని కాబట్టి తలుపులు వేసుకుని ఇంట్లోనే ఉండాలని కూడా బెదిరించారు. భయాందోళనలు సృష్టించి, బాధితులు ఎవరి సాయం తీసుకోకుండా చేయడానికి ఈ బెదిరింపులను ఉపయోగించారు.

బాధితులను తమ గుప్పెట్లోకి తీసుకున్న తర్వాత కేటుగాళ్లు తమ ఎఫ్‌డీ (FD)లను రద్దు చేసి ఆ నిధులను తమ సేవింగ్స్ ఖాతాలోకి బదిలీ చేయాలని ఆపై వేరొక ఖాతాకు పంపడానికి ఆర్‌టీజీఎస్ (RTGS) పూర్తి చేయాలని ఆదేశించారు. నివేదిక ప్రకారం జూలై 14న బాధితుడు రూ. 50.50 లక్షలను కేటుగాళ్లు చెప్పిన బ్యాంక్ ఖాతాకు బదిలీ చేశారు. ఆ డబ్బును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వెరిఫికేషన్ కోసమే వాడుతున్నామని స్కామర్లు నమ్మించారు. అయితే తిరిగి ఇస్తామన్న డబ్బు రాకపోగా.. బాండ్ మొత్తంగా మరో రూ. 14.50 లక్షలు ఇవ్వాలని స్కామర్లు మళ్లీ డిమాండ్ చేశారు. దాంతో తాను మోసపోయానని బాధితుడు గ్రహించారు.

అనంతరం బాధితుడు నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ (1930)ను సంప్రదించి, పుణె సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. భారతీయ న్యాయ సంహిత (BNS), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, 2000 లోని సంబంధిత నిబంధనల కింద పోలీసులు గుర్తుతెలియని వ్యక్తులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

డిజిటల్ అరెస్ట్ స్కామ్‌ల పట్ల ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండండి. ఎలాంటి ఒత్తిడికి లోనై డబ్బులు బదిలీ చేయవద్దు. అనుమానాస్పద కాల్స్ వస్తే వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కి నివేదించండి.

Also Read:అద్దంకి, సామాకు హరీశ్ లీగల్ నోటీసులు

- Advertisement -