భారత స్టార్ వెయిట్లిఫ్టర్ మీరాబాయి చాను 48 కేజీల కేటగిరీ పోటీల్లో మొదటి స్థానంలో నిలిచి వరుసగా మూడోసారి పసిడి పతకాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. స్నాచ్, క్లీన్ అండ్ జెర్క్ విభాగాల్లో కలిపి చాను మొత్తం 190 కేజీల బరువును ఎత్తారు. రెండో స్థానంలో నిలిచిన నైజీరియాకు చెందిన రూత్ నియోంగ్పై 22 కేజీల ఆధిక్యంతో ఆమె విజయం సాధించారు. చాను స్నాచ్ విభాగంలో తన మూడో ప్రయత్నంలో 85 కేజీలు ఎత్తి గేమ్స్ రికార్డు నెలకొల్పారు. ఆ తర్వాత క్లీన్ అండ్ జెర్క్లో 105 కేజీలు ఎత్తి మరొక గేమ్స్ రికార్డును సాధించారు. స్నాచ్లో ఆమె ఎత్తిన 85 కేజీల బరువు ఛాంపియన్షిప్ రికార్డు కాగా, ఆమె సాధించిన మొత్తం 190 కేజీల బరువు కూడా గేమ్స్ రికార్డుగా నమోదైంది.
స్నాచ్ విభాగంలో మొదట 82 కేజీల తొలి ప్రయత్నంలో విఫలమైనప్పటికీ, రెండు మరియు మూడో ప్రయత్నాల్లో 85 కేజీల బరువును చాను విజయవంతంగా ఎత్తారు. క్లీన్ అండ్ జెర్క్లో 105 కేజీల తొలి ప్రయత్నం విఫలమైనప్పటికీ, ఆ తర్వాతి ప్రయత్నంలో మణిపూర్ కు చెందిన ఈ వెయిట్లిఫ్టర్ అదే బరువును ఎత్తి స్వర్ణ పతకాన్ని ముద్దాడారు.
2018 గోల్డ్ కోస్ట్ గేమ్స్లో (48 కేజీల విభాగం), 2022 బర్మింగ్హామ్ గేమ్స్లో (49 కేజీల విభాగం) స్వర్ణాలు సాధించిన తర్వాత కామన్వెల్త్ గేమ్స్లో చానుకు ఇది వరుసగా మూడో పసిడి పతకం. భారత అథ్లెట్లు ఇదివరకే ఒక వెండి, ఒక కాంస్య పతకం సాధించగా, ఈ గ్లాస్గో ఈవెంట్లో భారత్కు లభించిన మొట్టమొదటి స్వర్ణ పతకం ఇదే.
అంతకుముందు రోజు, పురుషుల 60 కేజీల వెయిట్లిఫ్టింగ్లో రిషికాంత్ సింగ్ భారత్కు రజత పతకాన్ని అందించారు. రిషికాంత్ మొత్తం 264 కేజీలు ఎత్తి రెండో స్థానంలో నిలిచారు. 273 కేజీలు ఎత్తి నూతన గేమ్స్ రికార్డు నెలకొల్పిన మలేషియాకు చెందిన అనిక్ కస్దాన్ ప్రథమ స్థానంలో నిలిచారు. రిషికాంత్ స్నాచ్ మూడో ప్రయత్నంలో 121 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్ తొలి ప్రయత్నంలో 143 కేజీల బరువును విజయవంతంగా ఎత్తారు. క్లీన్ అండ్ జెర్క్లో ఆయన చేసిన 148 కేజీలు, 151 కేజీల మిగతా రెండు ప్రయత్నాలు విఫలమయ్యాయి.
Also Read:‘నేను రెడీ’..పెద్ద విజయం సాధించాలి!
మరోవైపు జూలై 24న జరిగిన పారా పవర్ లిఫ్టింగ్ పురుషుల హెవీవెయిట్ విభాగంలో ఝండు కుమార్ కాంస్య పతకం సాధించి, ఈ క్రీడల్లో భారత్కు తొలి పతకాన్ని అందించారు. ఆయన 181 కేజీలు, 190 కేజీల బరువును విజయవంతంగా ఎత్తి మొత్తం 130.9 పాయింట్లతో పతక పీఠాన్ని అధిరోహించారు. అయితే 196 కేజీల ఆయన చివరి ప్రయత్నం విఫలమైంది.

