వినియోగదారులు ఆహార భద్రతా నిబంధనల ఉల్లంఘనలపై ఫిర్యాదులు చేయడంతో ప్రముఖ క్విక్-కామర్స్ ప్లాట్ఫారమ్ అయిన స్విగ్గీ ఇన్స్టామార్ట్ కు భారత ఆహార భద్రత మరియు ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) తొమ్మిది నోటీసులు జారీ చేసింది.
వినియోగదారుల నుండి అందిన పలు ఫిర్యాదుల ఆధారంగా ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. డెలివరీ అయిన ఆహార పదార్థాల నాణ్యత సరిగ్గా లేకపోవడం, గడువు ముగిసిన ఉత్పత్తులను విక్రయించడం మరియు ప్యాకేజింగ్ నిబంధనలను పాటించకపోవడం వంటి తీవ్రమైన ఆరోపణలు స్విగ్గీ ఇన్స్టామార్ట్పై వచ్చాయి.
ఇన్స్టామార్ట్ ద్వారా ఆర్డర్ చేసిన కొన్ని ఆహార ఉత్పత్తులు ప్యాకింగ్ సరిగ్గా లేకపోవడం వల్ల దెబ్బతిన్నాయని, వినియోగానికి పనికిరాకుండా ఉన్నాయని వినియోగదారులు ఆరోపించారు. కొన్ని సందర్భాల్లో గడువు ముగిసిన లేదా ఎక్స్పైరీ డేట్కు చాలా దగ్గరగా ఉన్న వస్తువులను సరఫరా చేశారని ఫిర్యాదులు అందాయి.
స్విగ్గీ ఇన్స్టామార్ట్కు చెందిన వివిధ నగరాల్లోని డార్క్ స్టోర్లలో (వస్తువులను నిల్వ ఉంచే గిడ్డంగులు) తగిన పరిశుభ్రత ప్రమాణాలు పాటించడం లేదని ఎఫ్ఎస్ఎస్ఏఐ గుర్తించింది. ఆహార భద్రతా చట్టం ప్రకారం వినియోగదారుల ఆరోగ్యానికి ముప్పు కలిగించే ఏ చర్యలనైనా తీవ్రంగా పరిగణిస్తామని ఎఫ్ఎస్ఎస్ఏఐ స్పష్టం చేసింది. ఈ తొమ్మిది నోటీసులపై నిర్దేశిత గడువులోగా పూర్తి వివరణ ఇవ్వాలని స్విగ్గీ యాజమాన్యాన్ని ఆదేశించింది. ఒకవేళ ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేకపోతే, భారీ జరిమానాలతో పాటు లైసెన్స్ రద్దు వంటి కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది.
ఈ నోటీసులపై స్విగ్గీ ప్రతినిధి స్పందిస్తూ.. తాము వినియోగదారుల ఆరోగ్యానికి, ఆహార భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. ఎఫ్ఎస్ఎస్ఏఐ లేవనెత్తిన అంశాలను తాము పరిశీలిస్తున్నామని, నియంత్రణ సంస్థకు పూర్తి స్థాయిలో సహకరిస్తూ, తమ నిల్వ కేంద్రాలలో తగిన మార్పులు మరియు తనిఖీలను మరింత కఠినతరం చేస్తామని తెలిపారు.
Also Read:దేశ రక్షణ రంగానికి పవర్హౌస్గా ఏపీ!

