రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా నియమితులయ్యారు.ప్రస్తుతం పార్లమెంటరీ పార్టీ ఉప నేతగా వ్యవహరిస్తున్న రవిచంద్రను బీఆర్ఎస్ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు రాజ్యసభలో బీఆర్ఎస్ పక్ష నేతగా, పార్లమెంటరీ పార్టీ లీడర్ గా నియమించారు.బీసీలతో పాటు బహుజనులు,పార్టీకి రవిచంద్ర అందిస్తున్న సేవలను గుర్తించిన కేసీఆర్ ఆయన్ను రెండో సారి రాజ్యసభకు పంపడం జరిగింది.
రాజ్యసభ సభ్యుడిగా ఉన్న డాక్టర్ బండ ప్రకాష్ ముదిరాజ్ శాసనమండలికి వెళ్లడంతో,ఆ స్థానంలో రవిచంద్రను కేసీఆర్ ఎంపిక చేశారు.ఆ తర్వాత కేసీఆర్ ఆశీస్సులతో రెండో సారి రాజ్యసభకు ఎన్నికయ్యారు.బీఆర్ఎస్ నుంచి రాజ్యసభకు నలుగురు కే.ఆర్.సురేష్ రెడ్డి,దీవకొండ దామోదర్ రావు, డాక్టర్ బండి పార్థసారథి రెడ్డి,వద్దిరాజు రవిచంద్ర ఎన్నికయ్యారు… పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్న సురేష్ రెడ్డి ఇటీవల రిటైర్ కాగా,ఆ స్థానంలో రవిచంద్రను బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ నియమించారు.రవిచంద్ర పదవీ కాలం 2030 ఏప్రిల్ వరకు ఉంది.ఆయన పెట్రోలియం, సహజవాయువు పార్లమెంటరీ స్థాయీ సంఘం, బొగ్గు,గనుల శాఖ సంప్రదింపుల కమిటీ సభ్యులుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.
తనను పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఎంపిక చేయడం పట్ల వద్దిరాజు రవిచంద్ర బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్, కార్యనిర్వహక అధ్యక్షులు కే.టీ.రామారావులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు, ధన్యవాదాలు చెప్పారు.బీసీ వర్గానికి చెందిన తనను రాజ్యసభకు రెండు పర్యాయాలు పంపడమే కాకుండా పార్లమెంటరీ పార్టీ నేతగా నియమించడం పట్ల రవిచంద్ర హర్షం వ్యక్తం చేస్తూ…తనపై ఉంచిన ఈ గురుతర బాధ్యతను వినమ్రంగా స్వీకరించి,గౌరవిస్తూ తెలంగాణ ప్రజల గొంతును పార్లమెంటులో బలంగా వినిపిస్తానని, పార్టీని మరింత శక్తివంతం చేసేందుకు, కేసీఆర్ గారిని ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రిని చేసేందుకు శక్తివంచన లేకుండా తన వంతు కృషి చేస్తానని ఎంపీ వద్దిరాజు చెప్పారు. కాగా…రాజ్యసభ సభ్యుడుగా, బి ఆర్ ఎస్ ఫ్లోర్ లీడర్ గా ఉన్న కే ఆర్ సురేష్ రెడ్డి పదవీ కాలం ముగిసిన సంగతి తెలిసిందే.
Also Read:తక్కువ క్యాలరీలతో రుచికరమైన సూప్లు!

