అమెరికా- ఇరాన్ మధ్య వార్ మళ్లీ మొదలైంది. హార్ముజ్ జలసంధిలో స్వేచ్ఛా నౌకాయానానికి ముప్పు కలిగించే ఇరాన్ సామర్థ్యాన్ని మరింత బలహీనపరిచే లక్ష్యంతో ఈ ఆపరేషన్ చేపట్టామని యూఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. ఈ జలమార్గం గుండా వెళుతున్న వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులకు పాల్పడిందన్న ఆరోపణలకు ప్రతిస్పందనగా అమెరికా ఈ తాజా సైనిక దాడులను ప్రారంభించింది.
ఇరాన్ అధికారిక మీడియా కథనాల ప్రకారం… బుషెహర్, బందర్ అబ్బాస్, సిరిక్ వంటి పలు నగరాల్లో పేలుళ్లు సంభవించాయి. దేశంలోని ఆగ్నేయ ప్రాంతంలోని కోనారక్, చాబహార్ సమీపంలో కూడా పేలుడు సంభవించినట్లు ఇరాన్ ప్రసార సంస్థ ‘మెహర్ న్యూస్ ఏజెన్సీ’ నివేదించింది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇస్లామిక్ రిపబ్లిక్ న్యూస్ ఏజెన్సీ (IRNA) ప్రకారం, చాబహార్ మరియు దాని సమీప తీరప్రాంత నగరమైన కోనారక్లో దాదాపు 10 పేలుళ్ల శబ్దాలు వినిపించాయి.
జూలై 7న జరిగిన భారీ అమెరికా సైనిక ఆపరేషన్ ముగిసిన కొద్ది రోజులకే ఈ తాజా సైనిక చర్య చోటుచేసుకుంది. ఆ సమయంలో ప్రిసిషన్-గైడెడ్ మ్యూనిషన్స్ ఉపయోగించి ఇరాన్వ్యాప్తంగా 80కి పైగా లక్ష్యాలపై తమ దళాలు దాడి చేసినట్లు సెంట్కామ్ తెలిపింది. హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే వాణిజ్య నౌకలపై ఇరాన్ జరిపిన దాడులకు ప్రతిస్పందనగానే ఆ దాడులు చేసినట్లు అప్పట్లో అమెరికా వివరించింది.
పర్షియన్ గల్ఫ్లోని ‘అబు మూసా’ ద్వీపంలో కూడా పేలుళ్లు జరిగినట్లు ఇరాన్ మీడియా నివేదించింది. దక్షిణ నగరమైన సిరిక్లోని తహ్రూయి గ్రామానికి సమీపంలో మరో మూడు పేలుళ్లు వినిపించాయని ప్రత్యేక నివేదికలు తెలిపాయి. దీన్ని బట్టి తాజా దాడుల వేవ్లో అనేక ప్రాంతాలు ప్రభావితమయ్యాయని స్పష్టమవుతోంది.ఇరాన్లోని ఏకైక కార్యాచరణ అణు విద్యుత్ ప్లాంట్ ఉన్న ‘బుషెహర్’ నగరంలో కూడా పేలుళ్లు నమోదయ్యాయి. స్థానిక మీడియా ఈ పేలుళ్లను ధృవీకరించినప్పటికీ నష్టం వివరాలు తెలియరాలేదు. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ నిలిచిపోయిందని, ఈ ఘటనపై అధికారులు విచారణ ప్రారంభించారని ప్రభుత్వ ఆధ్వర్యంలోని IRNA తెలిపింది.
Also Read:మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ సర్కారే!

