ఇథనాల్ పెట్రోల్‌..కేంద్ర వెనక్కి!

3
- Advertisement -

పెట్రోల్‌లో ఇథనాల్ కలిపే ప్రక్రియపై దేశవ్యాప్తంగా వాహనదారులు మరియు ఆటోమొబైల్ సంస్థల నుండి వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. పెట్రోల్‌లో ఇథనాల్ శాతాన్ని ప్రస్తుతమున్న 20 శాతం (E20) నుండి 25 శాతానికి (E25) పెంచాలనే ప్రతిపాదనను ప్రభుత్వం కొంతకాలం వాయిదా వేసే అవకాశం ఉందని ఉన్నతస్థాయి వర్గాలు వెల్లడించాయి.

గత మూడేళ్లలోనే ఇథనాల్ బ్లెండింగ్‌ను 10% నుండి ఏకంగా 20% కి వేగంగా పెంచడం వల్ల వాహనాల మైలేజ్ తగ్గిపోతోందని..పాత వాహనాల ఇంజన్లు దెబ్బతింటున్నాయని వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో ప్రభుత్వం ఈ పునరాలోచనలో పడింది. నిజానికి పెట్రోల్‌లో 20% ఇథనాల్ కలిపే లక్ష్యాన్ని (E20 ఇంధనం) 2030 నాటికి చేరుకోవాలని ప్రభుత్వం మొదట భావించింది. కానీ గడువు కంటే ఐదేళ్ల ముందే ఈ లక్ష్యాన్ని వేగంగా అమలు చేయడంతో ప్రస్తుతం దేశవ్యాప్తంగా విక్రయిస్తున్న సాధారణ పెట్రోల్ అంతా E20 వేరియంట్‌గానే మారుతోంది.

ఇటీవల ప్రభుత్వం E25 ఇంధనానికి (25% ఇథనాల్, 75% పెట్రోల్) సంబంధించి ఎక్సైజ్ సుంకం మినహాయింపులు ఇవ్వడం, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) కొత్త ప్రమాణాలను నోటిఫై చేయడంతో త్వరలోనే 25% ఇథనాల్ పెట్రోల్ రాబోతుందనే ఆందోళన వాహనదారుల్లో మొదలైంది. పెట్రోల్‌తో పోలిస్తే ఇథనాల్‌లో కార్బన్ ఉద్గారాలు తక్కువగా ఉంటాయి. దీనివల్ల పర్యావరణ కాలుష్యం తగ్గుతుంది. అంతేకాకుండా, ముడి చమురు దిగుమతులపై భారతదేశం ఆధారపడటం తగ్గి, భారీగా విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుంది. ఇథనాల్‌కు ఆక్టేన్ నంబర్ కూడా ఎక్కువే.

పెట్రోల్‌తో పోలిస్తే ఇథనాల్‌కు ‘కెలోరిఫిక్ వాల్యూ’ తక్కువ. అందువల్ల ఇథనాల్ శాతం పెరిగేకొద్దీ వాహనాల మైలేజ్ స్పష్టంగా తగ్గిపోతుందని వాహనదారులు ఫిర్యాదు చేస్తున్నారు. ఇథనాల్‌కు తేమను (నీటిని) ఆకర్షించే గుణం ఉంటుంది. దీనివల్ల సాధారణ ఇంజన్లలో, ముఖ్యంగా పాత కార్లు, బైక్‌లలో తుప్పు పట్టే ప్రమాదం ఉంది. ఇంధన పైపులు, ఇతర భాగాలు త్వరగా పాడవుతాయి. ఇథనాల్ పెట్రోల్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద మండుతుంది. దీనివల్ల చలికాలం ఉదయాల్లో పాత వాహనాలను స్టార్ట్ చేయడం ఇబ్బందిగా మారుతుంది.

ఈ సమస్యలపై గత వారం ప్రభుత్వ ఉన్నత స్థాయి వర్గాల మధ్య జరిగిన ఒక సమావేశంలో తీవ్ర చర్చ జరిగింది. వాహన తయారీ సంస్థలు (OEMs) వినియోగదారుల సమస్యలను శాస్త్రీయంగా పరిష్కరించాలని ప్రభుత్వం సూచించింది.E20 స్థాయిని దాటి ముందుకు వెళ్లాలంటే వాహన రంగానికి తగిన సమయం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం ఉన్న వాహనాలకు ఇబ్బంది కలగకుండా ఈ పరిణామం చాలా నెమ్మదిగా, క్రమబద్ధమైన పద్ధతిలో జరుగుతుంది అని ఒక సీనియర్ ప్రభుత్వ అధికారి తెలిపారు.

Also Read:7 వేల కోట్లు..9 వారాలకే రోడ్డు క్లోజ్!

ప్రస్తుతం ప్రముఖ కార్ల తయారీ సంస్థలు ఇథనాల్ ఇంధనానికి అనుకూలంగా ఉండేలా, ఎక్కువ కంప్రెషన్ రేషియో కలిగిన కొత్త రకం ఇంజన్లను అభివృద్ధి చేసే పనిలో పడ్డాయి. అయితే, పాత వాహనదారుల ప్రయోజనాలను దెబ్బతీయకుండా పూర్తి స్థాయి పరీక్షలు మరియు అన్ని వర్గాల సంప్రదింపుల తర్వాతే E25 ఇంధనాన్ని మార్కెట్లోకి తెస్తామని ప్రభుత్వం హామీ ఇస్తోంది.

- Advertisement -