సమైక్య పాలనలో పాలమూరు వలసల జిల్లాగా మారిన పాలమూరు పచ్చబడాలన్నారు మంత్రి కేటీఆర్. పాలమూరు జిల్లాలో పర్యటించిన కేటీఆర్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్ధాపన చేశారు. మయూరి నర్సరీలో అర్బన్ లంగ్ స్పేస్ పార్క్, అడ్వెంచర్ పార్క్ను కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్ తెలంగాణలో 40 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నామని తెలిపారు. పాలమూరు ఎంపీగానే సీఎం కేసీఆర్ తెలంగాణ సాధించారని గుర్తుచేశారు.
తెలంగాణ వచ్చాక జిల్లాలో అభివృద్ధి జరుగుతుందన్నారు. పాలమూరు జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని ఉద్ఘాటించారు. గతంలో 10 రోజులకొక సారి మంచినీళ్లు వచ్చేది. త్వరలోనే ఆ సమస్య తొలగిపోతుందన్నారు. మిషన్ భగీరథ పూర్తయితే తాగునీటి కష్టాలు తీరుతాయన్నారు మంత్రి. వచ్చే ఎండకాలం నుంచి ప్రతి ఇంటికీ మంచినీరు సరఫరా చేస్తామని ఉద్ఘాటించారు
గత ముఖ్యమంత్రులు జిల్లాను దత్తత తీసుకున్న ఒరిగిందేమి లేదన్నారు. పేదింటి ఆడబిడ్డల పెళ్లికి కళ్యాణ లక్ష్మి పథకంతో ఆకట్టుకుంటున్నామని చెప్పారు. వలసలు వెళ్లిన వారు తిరిగిరావాలనే సీఎం కేసీఆర్ ప్రాజెక్టులకు రూపకల్పన చేశారని తెలిపారు. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేసిన ఘనత కేసీఆర్దే అన్నారు. మహబూబ్ నగర్లో 3700 డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం చేపట్టామని దసరా నాటికి 1200 ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు.
గ్రామీణ ఆర్ధిక వ్యవస్ధ పరిపుష్టం చేయడానికి సీఎం కేసీఆర్ కృషిచేస్తున్నారని కేటీఆర్ స్పష్టం చేశారు. గొర్రెల పంపిణి, చేనేత లక్ష్మీ పథకం,చేపల పంపిణి ద్వారా వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నామని తెలిపారు.
మయూరీ నర్సరీలో అడ్వెంచర్ పార్క్ను ప్రారంభించిన కేటీఆర్ రోప్ వేపై ప్రయాణించారు. మహబూబ్నగర్ న్యూటౌన్ నుంచి రైల్వేష్టేషన్ వరకు సీసీ రోడ్డు, సెంట్రల్ లైటింగ్ పనులకు మంత్రులు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి లక్ష్మారెడ్డి, ఎంపీ జితేందర్రెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్గౌడ్, కలెక్టర్ రొనాల్డ్ రాస్తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.