నూతన సంవత్సర వేడుకల సందర్భంగా హైదరాబాద్ నగరంలో పోలీసులు కఠిన ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు. ఇవాళ రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా పలు కీలక ప్రాంతాల్లో వాహనాల రాకపోకలను నియంత్రించనున్నారు.
నెక్లెస్ రోడ్, ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్బండ్ వైపు వాహనాలకు నో ఎంట్రీ విధించారు. బేగంపేట్, టోలీచౌకి ప్రాంతాల ఫ్లైఓవర్లు మినహా నగరంలోని అన్ని ఫ్లైఓవర్లను తాత్కాలికంగా మూసివేయనున్నారు. పీవీ ఎక్స్ప్రెస్వేపైకి వెళ్లేందుకు ఫ్లైట్ టికెట్ ఉన్న వాహనదారులకే అనుమతి ఉంటుందని పోలీసులు స్పష్టం చేశారు.
అలాగే ఇవాళ రాత్రి 10 గంటల నుంచి 2 గంటల వరకు హైదరాబాద్ సిటీలోకి ప్రైవేట్ బస్సులకు కూడా నో ఎంట్రీ విధించారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించాలని సూచించారు.
ఇదే సమయంలో డ్రంక్ అండ్ డ్రైవ్పై కఠిన చర్యలు ఉంటాయని హైదరాబాద్ సీపీ సజ్జనార్ హెచ్చరించారు. నగరంలోని 120 ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించనున్నారు. మద్యం తాగి పట్టుబడితే భారీ జరిమానా, వాహనాల జప్తు, జైలు శిక్షతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తామని తెలిపారు. ర్యాష్ డ్రైవింగ్, బహిరంగ ప్రదేశాల్లో న్యూసెన్స్ చేసే వారిపైనా కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ప్రజలు న్యూ ఇయర్ వేడుకలను సురక్షితంగా, శాంతియుతంగా జరుపుకోవాలని పోలీసులు కోరారు.
Also Read:అధిక బరువుతో కిడ్నీలకు ఎఫెక్ట్!

