నిద్రకు ముందు ఫోన్ వాడుతున్నారా?

5
- Advertisement -

మనలో చాలా మందికి ఫోన్ లేకుంటే నిద్ర పట్టదు. అయితే ఇప్పుడు ఇదే అనేక సమస్యలకు కారణమవుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ అలవాటు కళ్లపై మెల్లగా భారాన్ని పెంచడంతో పాటు నిద్ర నాణ్యతను కూడా ప్రభావితం చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా అనిపించే ఈ అలవాటు వల్ల కళ్లలో పొడిబారటం, అలసట, మంట, నొప్పి, అలాగే నిద్రలేమి సమస్యలు రావచ్చని చెబుతున్నారు.

చీకటి లేదా తక్కువ వెలుతురు ఉన్న గదిలో ఫోన్ వాడటం కళ్లపై అదనపు ఒత్తిడిని పెంచుతుంది. ఇంకో ముఖ్య కారణం బ్లూ లైట్. ఫోన్ స్క్రీన్ నుంచి వచ్చే నీలి కాంతి మెదడులోని పైనియల్ గ్రంథిపై ప్రభావం చూపుతుంది. ఇది నిద్ర–మేల్కొనే చక్రాన్ని నియంత్రించే మెలటోనిన్ హార్మోన్ విడుదలను ఆలస్యం చేస్తుంది. బ్లూ లైట్ కళ్లకు శాశ్వత నష్టం చేయకపోయినా, మెదడును అప్రమత్తంగా ఉంచుతుంది.

రాత్రివేళ ఫోన్ వాడటం వల్ల చిన్న, ప్రకాశవంతమైన స్క్రీన్‌పై ఎక్కువసేపు దృష్టి కేంద్రీకరించాల్సి వస్తుంది. ఫోన్‌ను ముఖానికి అతి దగ్గరగా పట్టుకోవడం ఒత్తిడిని మరింత పెంచుతుంది. దీని వల్ల కళ్లకు బరువుగా అనిపించడం, చూపు మసకబారటం, అలసటతో పాటు కొందరిలో తలనొప్పులు లేదా మైగ్రేన్ సమస్యలు రావచ్చు. అలాగే ఫోన్ చూస్తున్నప్పుడు మనం చాలా తక్కువగా కంటిచూపు మూసుకుంటాం. దీంతో కళ్లకు అవసరమైన సహజ తేమ తగ్గి, పొడిబారటం, మంట, ఇసుక పడినట్టున్న అసౌకర్యం ఎక్కువగా అనిపిస్తుంది.

Also Read:TTD:గౌహతిలో శ్రీవారి ఆలయం

రాత్రివేళ స్క్రీన్ వాడకం కేవలం కళ్లకే కాదు, నిద్రకూ ఇబ్బంది కలిగిస్తుంది. బ్లూ లైట్ మెదడుకు అప్రమత్తంగా ఉండమని సంకేతాలు ఇస్తుంది. దాంతో నిద్ర పట్టడం కష్టం అవుతుంది. నిద్ర వచ్చినా అది పూర్తిగా విశ్రాంతినివ్వకపోవచ్చు. అయితే ఫోన్‌ను పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. పడుకునే ముందు 30 నుంచి 60 నిమిషాలు స్క్రీన్ వాడకాన్ని తగ్గించడం, నైట్ మోడ్ లేదా బ్లూ లైట్ ఫిల్టర్ ఆన్ చేయడం, గది వెలుతురుకు తగ్గట్టు స్క్రీన్ బ్రైట్‌నెస్ సెట్ చేయడం మంచిది. తరచూ తలనొప్పి, చూపు మసకబారటం, కళ్ల పొడిబారటం వంటి సమస్యలు ఉంటే తప్పకుండా కంటి వైద్యుడిని సంప్రదించాలి.

- Advertisement -