కేంద్ర ప్రభుత్వం “2025 విత్తన చట్టం” ముసాయిదా ప్రకటించింది. ఈ ముసాయిదాపై సూచనలు, అభ్యంతరాలు, సలహాలు డిసెంబర్ 11వరకు పంపిచాల్సిందిగా కోరింది. చట్టాన్ని పరిశీలిస్తే కార్పోరేట్ సంస్థలకు రైతుల నుండి వేలకోట్ల రూపాయల దోచుకునేదుకే విడుదల చేసినట్లు స్పష్టమౌతున్నది.దీనికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా రౌండ్ టేబుల్ సమావేశాలు సదస్సులు, సెమినార్ లు నిర్వహిస్తామని ప్రకటించారు . 2004లో నాటి కాంగ్రేస్ ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశ పెట్టిన ముసాయిదా చట్టానికి 2010లో, 2019లో సవరణలు చేసినప్పటికీ నేటికి ఆమోదం పొందలేదు తిరిగి 2025 విత్తన ముసాయిదా చట్టాన్ని తెచ్చారు.
ఈ ప్రతిపాదిత చట్టంలో కేంద్ర విత్తన కమిటీకి చైర్మెన్ సహా మరో 27 మందిని ఎన్నుకోవాలి. షెడ్యూల్ 1 పార్ట్ ఎ లో చూపిన నామినేట్ కమిటీలో మెజార్టీ కార్పోరేట్ సంస్థలకు అనుకూలంగా ఉన్న వారినే నియమిస్తారు. అలాగే సెక్షన్ 9 ప్రకారం రిజిస్ట్రేషన్ కమిటీ మరియు సబ్ కమిటీలు, సెక్షన్ 10 ప్రకారం వేసే రాష్ట్ర విత్తన కమిటీల ఎంపికలో పారదర్శకత లేదు. ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వారినే ఎన్నుకుంటారు. 1966 విత్తన దిగుమతి చట్టం, దాని సవరణ చట్టం 1986 తర్వాత దేశంలోను, రాష్ట్రాలలోను విత్తనోత్పత్తి పెరిగి ప్రస్తుతం అనేక దేశాలకు ఎగుమతి చేస్తున్నాము. టాటా, బిర్లా, ఐటిసి లాంటి సంస్థలే కాక విదేశీ కార్పోరేట్ సంస్థలైన మన్శాంటో, బేయర్, డూ-పాయింట్, సింజెంటా, కార్గిల్ సంస్థలు విత్తన రంగంపై పూర్తి పట్టు కలిగి ఉన్నాయి. విత్తన ధరలను ఇష్టారీతిగా పెంచటం, నాణ్యత లేని విత్తనాలను, పాలినేషన్ తక్కువ ఉన్న విత్తనాలను రైతులకు అంటగట్టి లాభాలు సంపాదిస్తున్నారు. రైతుల పంటల ఉత్పాదకతను దెబ్బతీస్తున్నారు. వీటి నియంత్రణకు గత ప్రభుత్వాలు జంకి విత్తన చట్టం తేవడానికి ముందుకు రాలేదు. వాస్తవానికి విత్తన చట్టం రాజ్యాంగం రీత్యా రాష్ట్ర జాబితాలోనిది. 2017లో రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన చట్టాన్ని ఆమోదించకుండా కేంద్రం అడ్డుకున్నది.
ప్రస్తుత ముసాయిదాలో సెక్షన్ 16 (3) ప్రకారం విత్తనాలను వాణిజ్యపరంగా రైతులకు విడుదల చేయటానికి దేశంలోనూ, ఇతర దేశాలలోనూ పరిశోధనలు చేయవచ్చని చెప్పింది. దేశంలో 7 వాతావరణ జోన్స్ ఉన్నాయి. ఆ జోన్ లలో విత్తన పరిశోధన జరిపిన విత్తనాలే రైతులకు ఉపయోగపడ్డాయి. విదేశీ వాతావరణంలో జరిగిన ప్రయోగాలు ఉపయోగపడవు. గతంలో బిటి విత్తనాల వలన రైతులు నష్టపోయారు. తిరిగి విదేశీ టెక్నాలజీకే అవకాశం కల్పిస్తున్నారు. కంపెనీలు నాణ్యత లేని విత్తనాలు సరఫరా చేస్తే లైసెన్సులు రద్దు చేయటం, జైలు శిక్షలు విధించటం లాంటి పెనాల్టీలు ముసాయిదాలో లేవు. అమెరికా లాంటి సామ్రాజ్య వాద దేశాల ఒత్తిడికి లొంగి విత్తన చట్టం రూపొందించినట్లు విదితమౌతున్నది.
రైతుల ప్రయోజనాలకు అనుకూలంగా, దేశీయ టెక్నాలజీని వినియోగించి వాతావరణ జోన్స్లలో ప్రయోగాలు, పరిశోధనలు చేసి రైతులకు అందించే విధంగా విత్తన చట్టాన్ని రూపొందించాలి. విత్తన నాణ్యతపై, జెర్మినేషన్ పై స్పష్టత ఉండాలి. రాష్ట్రాల స్థాయిలో నిపుణులతో సమావేశాలు ఏర్పాటు చేసి విత్తన చట్ట ముసాయిదాను రూపొందించాలి. కార్పోరేట్ సంస్థలు ఇప్పటికే రైతులను విత్తనాల నుండి మార్కెట్ వరకు ఏటా వేల కోట్లు దోచుకుంటున్నాయి. అందుకు అవకాశం లేకుండా రైతులకు రక్షణ కల్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను తెలంగాణ రైతు సంఘం డిమాండ్ చేస్తున్నది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు అరిబండి ప్రసాద్ రావు, సహాయ కార్యదర్శి మూడ్ శోభన్ లు పాల్గొన్నారు.

