గత కొంతకాలంగా విభిన్న కథాంశాలతో సినిమాలు చేస్తూ వస్తున్న నటుడు అల్లరి నరేష్, త్వరలో సస్పెన్స్ థ్రిల్లర్ ’12ఏ రైల్వే కాలనీ’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతున్నారు. నాని కాసరగడ్డ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కామాక్షి భాస్కర్ల కథానాయికగా నటిస్తున్నారు. ఈ శుక్రవారం థియేటర్లలో విడుదల కానుంది.
ఈ సందర్భంగా సినిమా గురించిన ఆసక్తికర విషయాలను వెల్లడించారు అల్లరి నరేష్. ’12ఏ రైల్వే కాలనీ’ సినిమాపై ప్రేక్షకులకు ఎలాంటి అంచనాలు ఉండాలో స్పష్టం చేశారు. ఈ సినిమాలో కామెడీ ఉండదు. ఇది సీరియస్ పంథాలో ఉంటూ థ్రిల్ను అందిస్తుంది. కథలో ఉన్న థ్రిల్ అంశాన్ని తగ్గించకూడదనే ఉద్దేశంతో ఫన్ ఎలిమెంట్స్ జోడించలేదు. నాకు, నా స్నేహితుల గ్యాంగ్కు మధ్య చాలా తక్కువ జోకులు ఉంటాయి, కానీ కథ మొత్తం హాస్యానికి దూరంగా ఉంటుంది అని అల్లరి నరేష్ తెలిపారు.
ఈ చిత్రంలో 20వ నిమిషం నుంచే సస్పెన్స్ అంశం మొదలవుతుందని నరేష్ చెప్పారు. శ్రీనివాస్ చిట్టూరి శ్రీనివాస్ సిల్వర్ స్క్రీన్ బ్యానర్పై ఈ చిత్రాన్ని నిర్మించారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో సాయి కుమార్, విష్ణు హర్ష, గెటప్ శ్రీను, సద్దాం, జీవన్ కుమార్ ముఖ్యపాత్రలు పోషించారు. డాక్టర్ అనిల్ విశ్వనాథ్ కథను అందించారు.
Also Read:పత్తి రైతుల ఆత్మహత్యలు కనిపించడం లేదా?

