కేటీఆర్‌పై బురద చల్లడం సరికాదు: హరీశ్‌

0
- Advertisement -

మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌‌పై బురదజల్లడంలో భాగంగానే కేటీఆర్‌ బావమరిదిపై డ్రగ్స్ కేసంటూ రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ కక్షసాధింపు చర్యలకు ఇది పరాకాష్ట అని మండిపడ్డారు మాజీ మంత్రి హరీశ్ రావు. ప్రజల దృష్టి మళ్లించేందుకు సృష్టించేందుకే జన్వాడ ఫాంహౌజ్‌‌లో డ్రగ్స్ పార్టీలు జరిగాయంటూ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ సోషల్‌ మీడియా వేదికగా ప్రచారాలు చేస్తోందన్నారు.

రాజ్‌ పాకాల నివాసంలో ఫ్యామిలీ ఫంక్షన్‌ ఉన్నదని ముందుగానే ప్రభుత్వ పెద్దలకు తెలుసు..గత రెండు రోజుల నుంచి రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్ పార్టీ సోషల్‌ మీడియా విభాగం శని, ఆదివారాల్లో బాంబులు పేలుతాయని అనడం, చెప్పినట్లుగానే ఇళ్లపై దాడులు చేయడం చూస్తే, ముందస్తు ప్రణాళికగా ఇది ప్రభుత్వం రూపొందించిన స్కెచ్ అని స్పష్టం అవుతోందన్నారు.

ఫ్యామిలీ ఫంక్షన్‌‌పై దాడిచేసి దాన్ని రేవ్ పార్టీగా చిత్రీకరించే ప్రయత్నం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను అన్నారు. వృద్ధులు, చిన్నపిల్లలు, భార్యాభర్తలు ఉన్న ఫ్యామిలీ ఫంక్షన్‌ను డ్రగ్స్ పార్టీగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు…కేటీఆర్, ఆయన సతీమణి గానీ ఆ ఫ్యామిలీ ఫంక్షన్‌కి వెళ్లకపోయినా వెళ్లినట్టు చిత్రీకరించడం గర్హనీయం అన్నారు.

కేటీఆర్‌ వ్యక్తిత్వాన్ని, ఇమేజ్‌‌ను దెబ్బతీసే ప్రయత్నం రేవంత్‌‌రెడ్డి ప్రభుత్వం చేయడం రాజకీయ కక్ష సాధింపు చర్య తప్ప మరేమీ కాదు…పోలీసులు, ఎక్సైజ్‌ అధికారులు ప్రభుత్వ ఒత్తిళ్లకు లొంగవద్దని, నిజాయితీగా ఉన్నది ఉన్నట్టు చెప్పాలని, వ్యవస్థపై అపనమ్మకం కలిగేలా ప్రవర్తించవద్దని నా విజ్ఙప్తి అన్నారు. రోజురోజుకు ప్రభుత్వంపై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత నుంచి దృష్టిమళ్లించేందుకే ఈ డ్రామా ఆడుతున్నారు..రాజకీయాల్లో నేరుగా ఎదుర్కోలేక కుటుంబ సభ్యులను అడ్డం పెట్టుకొని చీప్ పాలిటిక్స్ చేయడం మానుకోవాలని హెచ్చరిస్తున్నాను అన్నారు.

Also Read:రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒక డీఏ:రేవంత్

- Advertisement -