TTD:గోవిందరాజస్వామి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

2
- Advertisement -

తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో గురువారం ఉదయం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఘనంగా జరిగింది. దీపావ‌ళి ఆస్థానం సంద‌ర్భంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.

ఈ సందర్భంగా ఉదయం 6.30 నుండి 9 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం చేపట్టారు. ఇందులో భాగంగా శ్రీ గోవిందరాజస్వామివారి సన్నిధితో పాటు ఆలయ ప్రాంగణంలోని ఇతర ఆలయాల గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి, పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలీ గడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు.

అక్టోబ‌రు 30వ తేదీ దీపావళి సందర్భంగా సాయంత్రం 4 నుండి 5.30 గంటల వరకు శ్రీవారి సన్నిధి, పార్థసారథి స్వామి, ఆండాళ్ అమ్మవారు, కళ్యాణ వెంకటేశ్వర స్వామి, పుండరీకవల్లి అమ్మవారు, భాష్యకారుల వారికి, తైల సమర్పణ నిర్వహించనున్నారు.

అక్టోబర్ 31న సాయంత్రం 5:30 నుండి 6:30 గంటల వరకు దీపావళి ఆస్థానం వైభవంగా జ‌రుగ‌నుంది. ఆలయ ప్రాంగణంలోని పుండరికవళ్ళి అమ్మవారి ఆలయం నుండి నూతన వస్త్రాలు, దీపాలు తీసుకువచ్చి స్వామివారికి సమర్పిస్తారు. అనంతరం ఆలయంలో దీపావళి ఆస్థానం ఘనంగా నిర్వహించనున్నారు.

Also Read:KTR:తెలంగాణకు కేసీఆరే శ్రీరామ రక్ష

- Advertisement -