9న ఉపాధ్యాయ నియామక పత్రాలు అందజేత

1
- Advertisement -

ఈనెల 9 తేదీన హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో నూతనంగా ఎంపికైన ఉపాధ్యాయ అభ్యర్థులకు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఏ రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలను అందిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు. 9వ తేదీన సాయంత్రం నాలుగు గంటలకు జరిగే ఈ కార్యక్రమ ఏర్పాట్లపై సంబంధిత కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లతో నేడు సాయంత్రం టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా సి ఎస్ శాంతకుమారి మాట్లాడుతూ దాదాపు పదివేలకు పైగా ఉపాధ్యాయ అభ్యర్థులకు ఈ నియామక పత్రాలను జారీ చేస్తున్నట్టు తెలిపారు. ఎంపికైన ఉపాధ్యాయ అభ్యర్థుల కు సంబంధించి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియను సంబంధిత జిల్లా కలెక్టర్లు పూర్తి చేశారని. రేపు, సోమవారం, సాయంత్రంలోగా తుది జాబితాను పాఠశాల విద్యా కమిషనర్ సంబంధిత జిల్లా కలెక్టర్లకు అందజేస్తారని తెలిపారు. ఈనెల తొమ్మిదవ తేదీన ఎంపికైన ఉపాధ్యాయ అభ్యర్థులందరినీ మధ్యాహ్నం రెండు గంటల లోపే ఎల్. బి. స్టేడియానికి చేరేలా తగు ప్రణాళిక రూపొందించుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. ఎంపికైన ఉపాధ్యాయ అభ్యర్థులను హైదరాబాదుకు చేరవేయడానికి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి బస్సులో ఒక పోలీస్ కానిస్టేబుల్, సమన్వయ అధికారిని నియమించాలని సూచించారు. జిల్లా నుండి వచ్చే బస్సులను వేదిక కు సమీపంలోనే తగు పార్కింగ్ సదుపాయాన్ని ఏర్పాటు చేయడంతో పాటు అభ్యర్థులను స్టేడియం సమీపంలోనే దించే విధంగా చర్యలు చేపట్టాలని నగర పోలీస్ కమిషనర్ కు సూచించారు.

నగరంలో వర్షం వచ్చే అవకాశం ఉన్నందున రేయిన్ ప్రూఫ్ షామియానా ను వేయాలని అన్నారు. ఈ ఉపాధ్యాయ నియామక పత్రాలు అందజేసే కార్యక్రమానికి అభ్యర్థులతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా వచ్చే అవకాశం ఉన్నందున తగు ఏర్పాట్లు చేయాలని తెలిపారు. స్టేడియంలో అభ్యర్థులకు నియామక పత్రాలు అంద చేసేందుకు గాను జిల్లాల వారీగా ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ టెలి కాన్ఫరెన్స్ లో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్, అడిషనల్ డీజీ మహేష్ భగవత్, రోడ్లు భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శి హరిచందన, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వెంకట నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -