సూపర్ స్టార్ రజనీకాంత్ తన రాజకీయ ప్రవేశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై వ్యతిరేకత మొదలైంది. ఈ సందర్భంగా కెథడ్రెల్ రోడ్డులో మున్నేట్ర పడై కార్యకర్తలు ‘కబాలి’ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఇదే క్రమంలో కన్నడిగుడైన రజనీకాంత్ ఎన్నటికీ తమిళుడు కాలేడంటూ నినాదాలు చేశారు.
రజనీ తమిళనాడుకు అక్కర్లేదని, కర్ణాటకకు వెళ్లిపోవచ్చని వారు సూచించారు. ఇక ఇదే క్రమంలో తమిళ సంఘాలు నిన్న ఆందోళనలు నిర్వహించిన విషయం తెలిసిందే.

రజినీకాంత్ నివాసం వద్ద జరిగిన ఆందోళనలను వ్యతిరేకిస్తూ ఆయన మద్దతుదారులు, అభిమాన సంఘాలు ఇవాళ చెన్నైలో ర్యాలీ నిర్వహించాయి. వాషర్ మాన్ పేట్ లో రజినీ మద్దతుదారులు ప్లకార్డులతో నినాదాలు చేస్తూ ర్యాలీగా బయలుదేరారు. ఆందోళనల నేపథ్యంలో పోలీసులు చెన్నైలోని రజినీ నివాసం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రజనీకాంత్ ను వ్యతిరేకిస్తున్న తమిళ సంఘాలకు పోటీగా రజనీకాంత్ కు మద్దతుగా ఆయన అభిమానులు నేడు ప్రదర్శన – రాస్తారోకో చేపట్టారు.

రజనీకి ఏదైనా హాని తలపెట్టాలని చూస్తే కనుక చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. అయితే శాంతిభద్రతల కోణంలో పోలీసులు పలువురు అభిమానులను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా రజనీకాంత్ అభిమానులు మాట్లాడుతూ సినిమాల్లో నటించి పెద్ద ఎత్తున అభిమానులను కలిగి ఉన్న తలైవా స్థానికత విషయంలో రాద్దాంతం చేయడం ఉద్దేశపూర్వకమేనని అన్నారు.
రజనీ సినిమాల్లో నటించేటప్పుడు గుర్తుకురాని స్థానికత అంశం ఇప్పుడు ఎందుకు మొదలైందని ప్రశ్నించారు. అంతేకాకుండా ఈ వివాదానికి తెరతీయడం వెనుక ఉన్న వారెవరో బయటకు రావాలని డిమాండ్ చేశారు.

