మహాతో చారిత్రక ఒప్పందం

250
- Advertisement -

తెలంగాణలో  గోదావరి నదిపై మూడు బ్యారేజీల నిర్మాణానికి తెలంగాణ, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు కేసీఆర్, దేవేంద్ర ఫడ్నవీస్ చారిత్రక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ చారిత్రక ఒప్పందానికి సంబంధించిన కార్యక్రమం ముంబయి సహ్యాద్రి గెస్ట్ హౌజ్‌లో జరిగింది. మేడిగడ్డ, తుమ్మిడిహట్టి, చనాక – కొరాటా బ్యారేజీలకు సంబంధించిన మూడు ఒప్పందాలపై కేసీఆర్, ఫడ్నవీస్ సంతకాలు చేశారు. ఈ ఒప్పందాలతో గోదావరిలో హక్కుగా ఉన్న 950 టీఎంసీల నీటిని సద్వినియోగం చేసుకునే అవకాశం లభించింది. గోదావరి బ్యారేజీలపై ఇరు రాష్ట్రాలు సాంకేతిక ఒప్పందం కుదుర్చుకున్నాయి.

రెండు రాష్ట్రాల నీటి పారుదల శాఖ మంత్రులు తన్నీరు హరీష్ రావు, గిరిష్ మహాజన్, ఇంటర్ స్టేట్ వాటర్ బోర్డు సభ్యులుగా ఉన్నతెలంగాణ, మహారాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రులు ఈటెల రాజెందర్, సుదీర్ మంగత్రాయ్, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హన్సరాజ్ గంగారామ్, రెవెన్యూ శాఖ మంత్రులు మహమూద్ అలీ, చంద్రకాంత్ పాటిల్, అటవీ శాఖ మంత్రి జోగు రామన్న, ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్ రావు పాల్గొన్నారు. తెలంగాణ మంత్రులు పోచారం శ్రీనివాసరెడ్డి, జి.జగదీష్ రెడ్డి, ఎంపిలు బి. వినోద్ కుమార్, బాల్క సుమన్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే పుట్ట మధు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్ళి రాజీవ్ శర్మ, నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్ళి § రామకృష్ణ రావు, ప్రాజెక్టు చీప్ ఇంజనీర్లు శ్రీ ఎన్. వెంకటేశ్వర్లు, శ్రీ భగవంత్ రావు, ఇతర బోర్డ్ సభ్యులు, సాగునీటి మంత్రి ఒ.ఎస్.డి. శ్రీధర్ దేశ్ పాండె తదితరులు హాజరయ్యారు.

ఒప్పందం 1
గోదావరి నదిపై 100 మీటర్ల ఎత్తులో, 16 టి.ఎంసిల నీటి నిల్వ సామర్థ్యంతో మేడిగడ్డ వద్ద బ్యారేజి నిర్మాణానికి అంగీకారం కుదిరింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించే ఈ బ్యారేజి ద్వారానే గోదావరి నీటిని తెలంగాణ రాష్ట్రం తీసుకుంటుంది. కరీంనగర్, వరంగల్, మెదక్, నిజామాబాద్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో 18.19 లక్షల ఎకరాలు కొత్తగా సాగులోకి వస్తాయి. శ్రీరాంసాగర్, నిజాంసాగర్, సింగూర్ జలాశయాల కింద మరో 18 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ చెందుతుంది.

ఒప్పందం 2
ప్రాణహిత తమ్మిడిహట్టి వద్ద 148 మీటర్ల ఎత్తులో, 18 టిఎంసి ల నీటి నిల్వ సామర్థ్యంతో బ్యారేజి నిర్మాణం జరుగుతుంది. దీని వల్ల ఆదిలాబాద్ జిల్లాలోని ఆసిపాబాద్, బెల్లంపల్లి, చెన్నూర్, సిర్పూర్ – కాగజ్ నగర్ నియోజకవర్గాల్లో రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందనున్నది.

ఒప్పందం 3
పెన్ గంగపై 213 మీటర్ల ఎత్తులో 0.85 టిఎంసి ల నీటి నిల్వ సామర్థ్యంతో చనఖా – కొరాటా బ్యారేజి నిర్మాణం జరుగుతుంది. మహారాష్టలోని పొలాలతో పాటు ఆదిలాబాద్ జిల్లాలోని తాంసి, జైనథ్, టేలా మండలాలకు సాగునీరు అందుతుంది.

 

- Advertisement -