3 టిమ్స్‌ ఆసుపత్రులకు భూమి పూజ‌లు చేసిన సీఎం కేసీఆర్‌..

89
cm kcr
- Advertisement -

హైదరాబాద్‌ మహానగరం మూడు మల్టీ స్పెషాల్టీ ఆసుపత్రులతో ఆరోగ్య నగరంగా అవతరించబోతోంది. నగరంలోని మూడు ప్రాంతాల్లో నూతనంగా నిర్మించనున్న టిమ్స్‌ ఆసుపత్రులకు సీఎం కేసీఆర్ ఈరోజు భూమి పూజ‌లు చేశారు. రాష్ట్రంలో వైద్యానికి పెద్ద పీట వేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరో నవశకానికి నాంది పలికారు. హైద‌రాబాద్‌లోని కొత్త‌పేట‌, ఎర్ర‌గ‌డ్డ చెస్ట్ హాస్పిట‌ల్, అల్వాల్‌లో మ‌ల్టీ సూప‌ర్ స్పెషాలిటీ ఆస్ప‌త్రుల‌కు సీఎం కేసీఆర్ భూమి పూజ‌లు చేశారు. ఈ మూడు ఆస్ప‌త్రుల్లో స్పెషాలిటీ, సూప‌ర్ స్పెషాలిటీ వైద్య సేవ‌లు అందుతాయి. వైద్య విద్య కోసం పీజీ స్పెషాలిటీ, సూప‌ర్ స్పెషాలిటీ సీట్లు, న‌ర్సింగ్, పారా మెడిక‌ల్ కాలేజీలు కూడా అందుబాటులోకి రానున్నాయి. ఒక్కో టిమ్స్‌ను 1000 బెడ్ల సౌక‌ర్యంతో నిర్మించ‌నున్నారు. ప్ర‌తి ఆస్ప‌త్రిలో 26 ఆప‌రేష‌న్ థియేట‌ర్లు, 300 ఐసీయూ బెడ్స్‌తో పాటు ఆక్సిజ‌న్ సౌక‌ర్యం అందుబాటులోకి రానుంది.

ఎర్ర‌గ‌డ్డ 17 ఎక‌రాల్లో జీ ప్ల‌స్ 14 అంత‌స్తుల్లో వెయ్యి ప‌డ‌క‌ల టిమ్స్. ఆస్ప‌త్రిని నిర్మించ‌నున్నారు. ఈ మ‌ల్టీ సూప‌ర్‌ స్పె‌షా‌లిటీ హాస్పి‌ట‌ల్‌కు రూ.882 కోట్లు కేటాయించారు. కొత్త‌పేట 21.36 ఎక‌రాల్లో జీ ప్ల‌స్ 14 అంత‌స్తుల్లో వెయ్యి ప‌డ‌క‌ల టిమ్స్. ఆస్ప‌త్రిని నిర్మించ‌నున్నారు. ఈ మ‌ల్టీ సూప‌ర్‌ స్పె‌షా‌లిటీ హాస్పి‌ట‌ల్‌కు రూ.900 కోట్లు కేటాయించారు. అల్వాల్ 28.41 ఎక‌రాల్లో జీ ప్ల‌స్ 5 అంత‌స్తుల్లో వెయ్యి ప‌డ‌క‌ల టిమ్స్ ఆస్ప‌త్రిని నిర్మించ‌నున్నారు. ఈ మ‌ల్టీ సూప‌ర్‌ స్పె‌షా‌లిటీ హాస్పి‌ట‌ల్‌కు రూ.897 కోట్లు కేటాయించారు.గ్రేటర్‌ చుట్టూ నిర్మిం‌చ‌నున్న నాలుగు సూపర్‌ స్పెషాల్టీ హాస్పిట‌ల్ వల్ల రాష్ట్రం‌లోని పలు జిల్లా‌లకు చెందిన ప్రజ‌లకు కూడా వైద్య‌సే‌వలు మరింత చేరు‌వ‌కా‌ను‌న్నాయి.

ఈ కార్య‌క్ర‌మాల్లో మంత్రులు హ‌రీశ్‌రావు, మ‌హ‌ముద్ అలీ, వేముల ప్ర‌శాంత్ రెడ్డి, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్, మ‌ల్లారెడ్డి, స‌బితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్‌, సుధీర్ రెడ్డి, మైనంప‌ల్లి హన్మంత్ రావు, వివేకానంద గౌడ‌, కాలేరు వెంక‌టేశ్‌, సాయ‌న్న‌, రాజ్య‌స‌భ స‌భ్యులు కే కేశ‌వ‌రావు, జీహెచ్ఎంసీ మేయ‌ర్ గ‌ద్వాల్ విజ‌య‌ల‌క్ష్మితో పాటు ప‌లువురు ప్ర‌జాప్ర‌తినిధులు పాల్గొన్నారు.

- Advertisement -